గోదావరి మధ్యలో బోటు: ‘పాపికొండలు’ పర్యాటకులకు హడల్
గోదావరి మధ్యలో మర బోటు నిలిచిపోవడంతో పర్యాటకులు హడలెత్తిపోయారు. పాపికొండలుకు సమీపంలో జరిగిన ఈ ఘటన సందర్శకులను ఆందోళనకు గురిచేసింది. మరో మర పడవలో తరలించడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా, తెలంగాణలోని భద్రాద్రి - కొత్తగూడెం జిల్లాల మధ్య గల 'పాపికొండలు విహార యాత్ర' పర్యాటకుల్లో గుబులు రేపింది. విహారయాత్ర వెళుతున్న పర్యాటక పడవ నది మధ్యలో నిలిచిపోవడంతో సందర్శకులు భయాందోళనకు గురయ్యారు.
పాపికొండలు సమీపాన క్లచ్పేట్లు పట్టేయడంతో ఆదివారం నది మధ్యలో పడవ నిలిచిపోవడంతో పర్యాటకులు హడలెత్తిపోయారు. కొంత సమయం తరువాత నిర్వాహకులు మరో బోటు సహాయంతో ఆ బోటును పాపికొండలుకు తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
దేవీపట్నం మండలం మంటూరు నుంచి పాపికొండలు వరకు ఏవిధమైన మొబైల్ ఫోన్ సంకేతాలు ఉండవు. దీంతో బాహ్య ప్రపంచంతో పర్యాటకులకు సంబంధాలు తెగిపోతాయి. బోటు ఇంజిన్లో సాంకేతిక లోపంతో నది మధ్యలో నిలిచిపోయిందని బోటు సూపరింటెండెంట్ జి ప్రసన్నకుమార్ చెప్పారు. మరమ్మతులు చేసిన తర్వాత పర్యాటకులను తిరుగు ప్రయాణంలో సురక్షితంగా ఒడ్డుకు చేర్చామని చెప్పారు.
పరిమితిని మించి తరలింపుతోనే సమస్య
అధికారుల పర్యవేక్షణ లోపం, పాపికొండలు విహారయాత్ర పర్యాటకులకు శాపంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాపికొండలు అందాలను తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వందల మంది పర్యాటకులు వస్తుంటారు. బోట్లలో పరిమితికి మించి పర్యాటకులను తరలిస్తుండటంతో తరచూ సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయని డ్రైవర్లు కూడా చెబుతున్నారు.
రెండు రోజుల క్రితం...
రెండు రోజుల క్రితం సైతం పాపికొండలు విహారయాత్రకు వెళ్లిన ఒక పర్యాటక బోటు తిరిగి ప్రయాణంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో మరో బోటు సహాయంతో పర్యాటకులను గమ్యస్థానాలకు చేర్చారు. ఇలా ఒక బోటు మరమ్మతులకు గురైతే మరో బోటు సహాయంతో బోటును గోదావరి నదిలో తేవడం అంత సురక్షితం కాదని బోటు డ్రైవర్లు అంటున్నారు. రెండు బోట్ల భారం ఒకే బోటుపైనే పడటంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. పాపికొండలకు వెళ్లే పర్యాటక బోట్లు నిలిచిపోవడం మరో బోటు సహాయంతో వాటిని తీసుకెళ్లడం తరచూ జరుగుతున్నా పర్యాటక శాఖ అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దసరా సెలవులతో అంగుళూరు రేవు కిటకిట
పాపికొండలు విహార యాత్రలకు ఆదివారం పర్యాటకులు భారీగా పోటెత్తారు. ఒక వైపు ఆదివారం మరో వైపు దసరా సెలవులు ముగుస్తుండటంతో సుమారు ఆరు వేల మందికి పైగా పర్యాటకులు 20 బోట్లు, లాంచీలపై పాపికొండలుకు వెళ్లారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులతో అంగుళూరు గోదావరి రేవు కిటకిట లాడింది. ఎక్కడ చూసినా పర్యాటకులతో వచ్చిన వాహనాలే కనిపించాయి. రాష్ట్రం నలుమూలల నుంచి చేరుకున్న పర్యాటకులు అంగుళూరుతోపాటు పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నుంచి పాపికొండలు అందాలను తిలకించడానికి వెళ్లారు. గండిపోశమ్మ అమ్మవారి ఆలయానికి ఒక్కసారిగా పర్యాటక బోట్లు తరలిరావడంతో ఆలయం భక్తులతో రద్దీగా మారింది.
ఇబ్బందులు ఎదుర్కొంటున్న పర్యాటకులు
పాపికొండలుకు వెళ్లే బోట్లు పది గంటలకల్లా దేవీపట్నం దాటుకుని పాపికొండలుకు వెళ్లాలి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదివారం ఉదయం 11 గంటల వరకు పర్యాటక బోట్లు దేవీపట్నం దాటి వెళ్లలేదు. సాయంత్రం చీకటి పడితే గాని పాపికొండలు విహారయాత్రలను ముగించుకుని బోట్లు తిరిగి రావడం లేదు. ఉదయం పది గంటలకు ముందుగానే పాపికొండలకు వెళ్లితే తిరిగి ప్రయాణంలో సాయంత్రం అయిదు గంటలు దాటేసరికి దేవీపట్నం దాటుకుని పర్యాటక బోట్లు గమ్యస్థానాలకు చేరుతాయి. పర్యాటక బోట్లపై అధికారుల పర్యవేక్షణ పూర్తిస్థాయిలో లేకపోవడంతో పాపికొండలు వెళ్లే పర్యాటకులు ఇబ్బందులు తప్పడం లేదు.