మండలి రద్దు వాయిదా - బడ్జెట్ అయినా రాజధాని అయినా.. జగన్ ముందున్నవి రెండే దారులు...!
కరోనా వైరస్ ప్రభావంతో పార్లమెంటు ఉభయసభలు షెడ్యూల్ కు రెండు వారాల ముందే వాయిదా పడిపోవడంతో ఏపీ శాసనమండలి రద్దు కోసం వైసీపీ సర్కారు పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయ్యాయి. దీంతో అసెంబ్లీ బడ్టెట్ సమావేశాలకోసమైనా, రాజధాని తరలింపు కోసమైనా మండలిని తప్పకుండా నిర్వహించాల్సిన పరిస్దితి. దీంతో ఈ పరిస్ధితిని అధిగమించేందుకు ఆర్డినెన్స్ లు తీసుకొస్తే ఎలా ఉంటుందన్న దానిపై వైసీపీ సర్కారు కసరత్తు చేస్తోంది.
Recommended Video

కరోనా దెబ్బతో పార్లమెంటు వాయిదా..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఎలాగోలా వారం రోజుల నుంచి పార్లమెంటు నిర్వహిస్తున్న కేంద్రం... ఇవాళ తప్పనిసరి పరిస్దితుల్లో వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఎలాగైనా ఆమోదం పొందుతుందని ఏఫీ సర్కారు భావించిన శాసన మండలి రద్దు కూడా వాయిదా పడినట్లయింది. దీంతో తర్వాత జరిగే వర్షాకాల సమావేశాల వరకూ తప్పనిసరిగా వేచి చూడాల్సిన పరిస్దితి.

మండలి రద్దు కాకపోతే ప్రత్యామ్నాయాలు..
అనుకున్న విధంగా ఏపీ శాసనమండలి రద్దు బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు పరిస్దితులు అనుకూలించక వాయిదా పడిపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై జగన్ సర్కారు దృష్టిసారిస్తోంది. వాస్తవానికి పార్లమెంటు సమావేశాలు వాయిదా పడిపోయినా ఏపీ శాసనమండలి రద్దు ఆమోదం పొందాలంటే కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావచ్చు. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ అరికట్టే చర్యల విషయంలో బిజీగా ఉన్న కేంద్రం దీన్ని పట్టించుకునే పరిస్ధితి లేదు. అటువంటి పరిస్దితుల్లో ఏపీలో మండలి కొనసాగక తప్పదు. దీంతో కీలకమైన బడ్జెట్, రాజధాని తరలింపు వ్యవహారాల్లో ఏం చేయాలనే దానిపై ఏపీ సర్కారు కసరత్తు చేస్తోంది. కరోనా ప్రభావం నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే పరిస్దితి కనిపించడం లేదు. కాబట్టి బడ్జెట్ తో పాటు రాజధాని తరలింపుకూ ఆర్డినెన్స్ లు తీసుకొస్తే సరిపోతుందనే భావనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

బడ్జెట్ కు ఓకే కానీ.. రాజధాని తరలింపు ?
ఏపీలో శాసనమండలి కొనసాగుతుండటం వల్ల బడ్జెట్ ఆమోదానికి కానీ, రాజధాని తరలింపు బిల్లుల విషయంలో కానీ ప్రభుత్వం మండలిని పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్ధితి. అయితే బడ్డెట్ ఆమోదం కోసం ఆర్ధిక బిల్లు అయినందున మండలి నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. అయితే ఎటొచ్చీ రాజధాని తరలింపు ప్రస్తావన వస్తే తిరిగి మండలిలో బిల్లులు, సెలక్ట్ కమిటీ వ్యవహారం తెరపైకి వస్తాయి. ఇప్పటికే బిల్లులను సాంకేతిక కారణాలతో సెలక్ట్ కమిటీకి పంపకుండా అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్న టీడీపీ.. ఈ అంశాన్ని మరోసారి హైలెట్ చేస్తుంది. దీంతో రాజధాని తరలింపు ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదం పొంచి ఉంది.

రాజధాని తరలింపుకూ ఆర్డినెన్సే గతి..
పార్లమెంటులో మండలి రద్దు బిల్లు ఆమోదం కాకపోవడం, రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ సాధ్యం కాదన్న కారణాలు చూపి రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చే వీలుంది. అయితే దీనిపైనా విపక్షాలు న్యాయపోరాటం చేసే అవకాశాలూ లేకపోలేదు. దీంతో ఆర్డినెన్స్ జారీ విషయంలోనూ ప్రభుత్వం నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. ముఖ్యంగా మండలిలో బిల్లుల ఆమోదం విషయంలో విపక్ష టీడీపీ నుంచి ఎదురైన అసాధారణ చిక్కుల నేపథ్యంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని మరీ ఆర్డినెన్స్ పై ప్రభుత్వం ముందడుగు వేసే సూచనలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications