దమ్మూ ధైర్యం ఉందా: చంద్రబాబును ఏకేసిన పార్థసారథి
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు పార్థసారథి తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వానికి దమ్మూ ధైర్యం ఉంటే ఆదాయవ్యయాలపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అందుకు సిద్ధపడాలని ఆయన అన్నారు.
హైదరాబాదు నుంచి కట్టుబట్టలతో అమరావతికి పంపేశారంటున్న చంద్రబాబు వందల కోట్లు ఆడంబరాలకు ఖర్చు చేస్తున్నారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. మాయమాటలు, అబద్ధాలు చెప్పి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు.

ఖజానా ఖాళీ అయిందని అంటూనే ఆడంబరాలకు అడ్డగోలుగా ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తున్నారని, సంక్షేమ కార్యక్రమాలకు కోతలు వేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజలపై ఆర్టీసి చార్జీల భారం మోపారని అన్నారు. ప్రజలకు వాస్తవ ఆర్థిక పరిస్థితులు వివరించాలని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలుగుదేశం పార్టీ నాయకులకు వందల కోట్ల విలువైన భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని ఆయన ఆరోపించారు. కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చామని చంద్రబాబు అన్న విషయం తెలిసిందే. తాను ఇంకా హైదరాబాదులోనే ఉంటే ప్రజల తీర్పును అవమానించినట్లు అవుతుందని కూడా ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications