రెండో మాట!: రేణుకకు షాక్, మోహన్బాబుకు మద్దతు
హైదరాబాద్: సిడబ్ల్యూసి విభజన నిర్ణయం నేపథ్యంలో ఇరు ప్రాంతాల నాయకులలో పోటా పోటీ కనిపిస్తోంది. తెలంగాణలో, సీమాంధ్రలో ఆయా పార్టీలు విపక్షాలపై పై చేయి సాధించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. అదే సమయంలో ఇరు ప్రాంతాల నాయకులు తమ తమ ప్రాంత ప్రజల సెంటిమెంటుకు అనుగుణంగా సభలకు సై అంటున్నారు. ప్రధాన పార్టీలు నాయకులు సీమాంధ్రలో, తెలంగాణలో వేరు వేరు స్వరం వినిపిస్తున్నారు.
ఇటీవల ఎపిఎన్జీవోల సభకు ధీటుగా తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఈ నెల 29న సకల జన భేరీకి సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ వారు ఈ సభను నిర్వహిస్తున్నారు. టిజెఏసి సభ నిర్వహిస్తే ఆ క్రెడిట్ కాంగ్రెసు పార్టీకి ఏమాత్రం రాదు. దీంతో టిజెఏసి సభ కంటే ముందే తాము ఓ భారీ సభను నిర్వహించాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులు యోచిస్తున్నారు.
తెలంగాణ ఇచ్చేది.. తెచ్చేది మేమే అని తాము చెప్పినట్లుగా, తమ పార్టీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని, త్వరితగతిన రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేస్తుందని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు. రాష్ట్ర ఏర్పాటు కల కాంగ్రెసు ద్వారానే సాధ్యమైందని వారు ప్రజలకు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా జెఏసి సమావేశానికి ధీటుగా, వారికంటే ముందుగానే పెట్టాలని భావిస్తున్నారు.
టిజెఏసి సమావేశానికి ధీటుగా సభ జరిపే అంశంపై తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు సమావేశమయ్యారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతల భేటీకి ఆ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి తొలిసారి వచ్చారు. ఆమె రాకపై పొన్నం ప్రభాకర్, దామోదర రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినా, మిగతా నాయకులు ఆయనను సముదాయించారు.
మిగతా పార్టీలు కూడా తెలంగాణ క్రెడిట్ దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు ఆదివారం కరీంనగర్ జిల్లాలో మాట్లాడుతూ.. తమ పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఇచ్చినందు వల్లనే రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. తెలంగాణ కోసం ఉద్బవించిన తెలంగాణ రాష్ట్ర సమితి, రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమించిన బిజెపిలు పట్టు కోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెసు పార్టీ నాయకులు తమ వల్లే తెలంగాణ వచ్చిందని, టిడిపి తమ లేఖ వల్లే వచ్చిందని చెబుతుండగా, సీమాంధ్రలో ఆ పార్టీ నేతలు భిన్నమైన స్వరం వినిపిస్తున్నారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం వల్లనే కాంగ్రసు పార్టీ విభజనకు మొగ్గు చూపిందని, ఇందులో తమ పార్టీ తప్పు లేదని చెబుతున్నారు. అదే సమయంలో టిడిపి సీమాంధ్ర నేతలు తాము లేఖ ఇస్తేనే విభజించామని చెబుతున్న కాంగ్రెసు నేతలు ఆ మాట ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో చెప్పించగలరా అని సవాల్ చేస్తున్నారు.
కాంగ్రెసు పార్టీ ఓట్లు, సీట్ల కోసం, ఏఐసిసి అధ్యక్షురాలు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు, తెలంగాణలో తెరాస విలీనం, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో కలిసి వెళ్లేందుకు, తమ పార్టీని దెబ్బతీసేందుకు విభజనకు పూనుకున్నదని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇక విభజనపై గతంలో కేంద్రం నిర్ణయానికి కట్టుబడతామని చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇటీవల సమైక్యగళం ఎత్తుకుంది.
సీమాంధ్రలో కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య పోటా పోటీ నెలకొంది. పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఆదివారం మంత్రి టిజి వెంకటేష్ కాన్వాయ్ పైన కర్నూలులో సమైక్యవాదులు చెప్పులు విసిరారు. దీనిపై ఆయన ఘాటుగా స్పందించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వారు సమైక్యం ముసుగులో దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు ఇరు ప్రాంతాల ఉద్యోగులు తదితరులు ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. టిఎన్జీవోలు, ఎపిఎన్జీవోలు ఎవరికి వారు సభలు, సమావేశాలు నిర్వహించుకుంటూ హీట్ పెంచుతున్నారు. ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ.. తమ సమ్మెపై సోమవారం తీర్పు రావొచ్చునని, కోర్టు తీర్పు ఎలా ఉన్న తమ సమ్మె ఆగదన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులపై తాము ఒత్తిడి పెంచుతామని చెప్పారు. కేంద్రం నుండి తమకు సానుకూల సంకేతాలు ఉన్నాయని, స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు.
విభజన సెగ సినీ పరిశ్రమకు కూడా తాకింది. పలు సినిమాలు విడుదల కావడం లేదు. ఇటీవల విడుదలైన రామ్ చరణ్ తేజ తుఫాన్ సినిమాను ఇరు ప్రాంతాల్లో అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో వందేళ్ల సినిమా పండుగను వాయిదా వేసుకుంటే బావుంటుందని ప్రముఖ నటుడు మోహన్ బాబు తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పారు. రాష్ట్రం ఉద్యమాలతో అట్టుడుకుతున్న ఇలాంటి బాధా సమయంలో పండుగను జరుపుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.
మోహన్ బాబు వ్యాఖ్యలతో కొందరు విభేదించినా టిడిపి ఎంపి, నటుడు శివప్రసాద్ మాత్రం మద్దతు పలికారు! శివప్రసాద్ తిరుపతిలో మాట్లాడుతూ.. వందేళ్ల సినిమా పండుగను వాయిదా వేయాలన్నారు. ఉద్యమాలు జరుగుతున్న సమయంలో వందేళ్ల పండుగ సరికాదన్నారు. ఇరు ప్రాంతాల్లో ఉద్యమాలతో సిని రంగం ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిందన్నారు.