నేను బిజెపి ప్రధానిని కాదు: మోడీకి జై కొట్టిన బాబు, జగన్, కెసిఆర్
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు తాము కేంద్రానికి పూర్తిగా సహకరిస్తామని తెలుగుదేశం, టిఆర్ఎస్, వైసిపిలు వేర్వేరుగా మంగళవారం నాడు ప్రకటించాయి. ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ఈ పార్టీలు ఈ మేరకు హామీ ఇచ్చాయి.
సభ క్రమం తప్పకుండా జరగాలని టిడిపి లోకసభాపక్ష నేత తోట నరసింహం ఆకాంక్షించారు. అప్పుడే ఏపీకి సంబంధించిన ముఖ్యమైన సమస్యలను సభలో లేవనెత్తగలమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని విభజన సందర్భంగా సభా ముఖంగా ఇచ్చిన హామీ గురించి టిడిపి గట్టిగా ప్రస్తావిస్తుందన్నారు.
రాష్ట్రానికి భారీ ప్యాకేజిని కోరతామన్నారు. పార్లమెంట్ సజావుగా నడవాలని టిఆర్ఎస్ లోకసభా పక్ష నేత జితేందర్ రెడ్డి ఆకాంక్షించారు. అప్పుడే తాము రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను లేవనెత్తగలమన్నారు. విభజన చట్టంలోని పలు అంశాల అమలు మందగమనంలో ఉన్నట్లు చెప్పారు.
ఏపకి ఇచ్చే ప్యాకేజే తెలంగాణకు ఇవ్వాలన్నారు. 2 రాష్ట్రాలకూ ప్యాకేజీ ఇవ్వాలన్నారు. విభజన సమయంలో ఇచ్చిన పలు హామీల విషయమై ప్రస్తావిస్తామన్నారు. ఎన్డీయే ప్రభుత్వానికి తమ మద్దతు అంశాల వారీగానే ఉంటుందన్నారు. ప్రభుత్వానికి అంశాల వారీ మద్దతిస్తామని వైసిపి లోకసభాపక్ష నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. దేశాభివృద్ధికి ప్రధాని మోడీ అంకితమయినందున, ప్రధాన అంశాలపై మద్దతిస్తామన్నారు.
కాగా, అంతకుముందు, అఖిల పక్ష సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తాను దేశానికి ప్రధానిని అని, బిజెపికి కాదని, విపక్షాలు లేవనెత్తే అంశాలు అఏన్నింటికి తాము సమాధానమిస్తామని చెప్పారు. సభను సజావుగా జరగనివ్వాలన్నారు. కాగా, కాంగ్రెస్, లెఫ్ట్లు జెఎన్యు, వేముల రోహిత్ అంశాలను లేవనెత్తాయి.