‘‘పార్టీ పరువును బజారుకు ఈడ్చారు.. ఎలా ఇస్తాను మంత్రి పదవి?’’
మంత్రి పదవి రాలేదనే అసంతృప్తితో గోరంట్ల బుచ్చయ్య చౌదరి బహిరంగంగా వ్యాఖ్యలు చేసి పార్టీ పరువును బజారుకు ఈడ్చారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
అమరావతి: మంత్రి పదవి ఇవ్వలేదంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి రచ్చ చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శుక్రవారం రాత్రి ఉండవల్లి లోని తన నివాసంలో ఆయన తూర్పు గోదావరి జిల్లా టీడీపీ సమన్వయ సమావేశం నిర్వహించినట్లు తెలిసింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ బుచ్చయ్య చౌదరి సామాజిక వర్గానికి చెందిన వారు ఇప్పటికే చాలామంది మంత్రి వర్గంలో ఉన్నారని, అలాంటప్పుడు ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఎలా అనుకున్నారని ప్రశ్నించారు.
ఈ విషయం తెలిసి కూడా ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేసి పార్టీ పరువును బజారుకు ఈడ్చారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సమావేశానికి బుచ్చయ్య చౌదరి గైర్హాజరు కావడంపైన, బుచ్చయ్య చౌదరి గురించి చంద్రబాబు చాలా సేపు మాట్లాడినట్లు తెలిసింది.
తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ పరిస్థితుల గురించి చంద్రబాబు విశ్లేషించినట్లు, ఈ సందర్భంగా నేతల మధ్యన సమన్వయం లేదంటూ మంత్రి యనమల, జ్యోతుల నెహ్రూ గురించి ప్రస్తావించినట్లు సమాచారం.
ఉద్వేగానికి గురైన బుచ్చయ్య చౌదరి..
మరోవైపు మంత్రి పదవి దక్కక అసంతృప్తితో ఉన్న బుచ్చయ్య చౌదరి మరోసారి ఉద్వేగానికి లోనైనట్లు తెలిసింది. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని, విలువలే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. వచ్చే నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశానికి తాను వస్తానో, రానో తనకు తెలియదని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.
టీడీపీలో జరుగుతున్న చర్యలకు నిరసనగానే తాను ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశానని వ్యాఖ్యానించిన బుచ్చయ్య చౌదరి ఫిరాయింపులపై మాట్లాడుతూ అధికారంలో ఉన్న వారు ప్రలోభానికి గురిచేయడం సర్వసాధారణమైపోయిందని, కొందరు రాజకీయాన్ని వృత్తిగా భావిస్తూ తప్పుడు పనులు చేస్తున్నారంటూ మండిపడినట్లు తెలిసింది.