గంటా, లగడపాటిలపై ధ్వజం: రూట్ మార్చిన కొండ్రు
తాను రాష్ట్ర విభజన అంశంపై అధిష్టానం చెప్పినట్లు నడుచుకుంటానని కొండ్రు మురళీ స్పష్టం చేశారు. ఒకవేళ విభజన అనివార్యమైతే సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరగదని ఆయన తెలిపారు. అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు, లగడపాటి రాజగోపాల్పై చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
పార్టీ నేతలపై చర్యలుంటాయి: గండ్ర
హైదరాబాద్: అధిష్టాన నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పక తప్పడం లేదని ప్రభుత్వ చీఫ్విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. ఆయన గురువారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. క్రమశిక్షణ చర్యలు వద్దంటున్ననేతలు డిసెంబర్ 7న తెలంగాణపై తీర్మానం చేసినప్పుడు ఎక్కడున్నారని గండ్ర వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు లేఖ రాస్తానని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తుపాను బాధితులను పరామర్శించేందుకు వెళ్లాడా? లేక విహారాయాత్రకు వెళ్లాడా అని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు పర్యటనను చూస్తుంటే విహార యాత్రకు వెళ్లినట్లే ఉందని గండ్ర ఆరోపించారు.