తిరుమలలో కాకబలి
Tirumala: కనుమ పండగ నాడు ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల కళకళలాడింది. ఒకవంక వైకుంఠ ద్వార దర్శనం, మరోవంక వేర్వేరు ఉత్సవాలతో కోలాహలంగా కన్నుల పండువగా కనిపించింది. గోవిందుడి నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. పండగ శోభ నెలకొంది.
కాకబలితో ఆరంభం..
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి ఏడాది కనుమ పండుగను పురస్కరించుకుని ఉదయాత్పూర్వం నిర్వహించే కాకబలి కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ఆరంభం అయ్యాయి. ఇందులో భాగంగా అర్చకులు పసుపు, కుంకుమ వేర్వేరుగా కలిపిన అన్నాన్ని ఆనంద నిలయం విమాన వేంకటేశ్వరస్వామివారికి నివేదించారు.

కన్నుల పండువగా పార్వేట ఉత్సవం
మధ్యాహ్నం శ్రీ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీమలయప్ప స్వామివారిని సంప్రదాయ క్షత్రియ వేటగాడి వేషం ధరింపజేశారు. శంఖు, చక్రం, గద, బాణం, ఖడ్గం వంటి పంచాయుధాలతో మధ్యాహ్నం ఒంటిగంటకకు తిరుచ్చిపై పార్వేట మండపానికి తీసుకు వచ్చారు.
మలయప్ప స్వామివారి తరపున
మరో తిరుచ్చిపై శ్రీ కృష్ణస్వామి వేంచేశారు. అనంతరం పార్వేట మండపంలో పుణ్యాహ వాచనం, ఆరాధన, నివేదనం, హారతులను శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు. కృష్ణస్వామివారిని సన్నిధి యాదవ పూజ చేసిన చోటుకు వేంచేపుచేసి పాలు, వెన్న, హారతులు సమర్పించారు. మలయప్ప స్వామివారి తరపున అర్చకులు ఈటెను విసిరి పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు.
ప్రణయ కలహోత్సవం..
సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రణయ కలహోత్సవం వేడుకగా ముగిసింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజున ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు పల్లకి ఎక్కి మహాప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు.
పాశురాలను నిందాస్తుతి శైలిలో
అమ్మవార్లు చెరొక పల్లకిపై అప్రదక్షిణంగా స్వామివారికి ఎదురుగా వచ్చి నిలుచున్నారు. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరఫున జియ్యంగార్లు ప్రణయకలహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఆస్థానం నిర్వహించారు. ఈ ఉత్సవంలో శ్రీ నమ్మాళ్వార్ రచించిన ఆళ్వార్ దివ్య ప్రబంధంలోని పాశురాలను నిందాస్తుతి శైలిలో అర్చకులు పారాయణం చేశారు.
ఆద్యంతం ఆకట్టుకున్న గోదా కల్యాణం
రాత్రి తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలో రాత్రి కన్నుల పండువగా గోదా కల్యాణం జరిగింది. ముందుగా శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను అలంకరించిన అర్చకులు కల్యాణ వేదిక మీద వేంచేపు చేశారు. శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీవిష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణం, రక్షాబంధనం అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు.
నారాయణుడి నామ సంకీర్తనలు
సర్కార్ సంకల్పం, భక్తుల సంకల్పం, మధుపర్క నివేదనం, వస్త్ర సమర్పణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా చేపట్టారు. మహా సంకల్పం, స్వామివార్లు- అమ్మవార్ల ప్రవరలు, మాంగల్యపూజ, మాంగల్య ధారణ కార్యక్రమాలు నిర్వహించారు. నారాయణుడి నామ సంకీర్తనలతో గోదా కల్యాణం కార్యక్రమం ముగిసింది.












Click it and Unblock the Notifications