తిరుమలలో ఏడాదికొక్కసారి మాత్రమే- శ్రీనివాసుడికి అరుదైన కానుక
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం నాడు 64,063 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 30,663 మంది తలనీలాలు సమర్పించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.80 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది.
కనుమను పురస్కరించుకుని పార్వేట ఉత్సవం తిరుమలలో అత్యంత ఘనంగా జరిగింది. అదేరోజున గోదాపరిణయోత్సవం కూడా కన్నుల పండుగగా ముగిసింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని ఆండాళ్ శ్రీ గోదాదేవి నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. ఈ మాలలను శ్రీవారి మూల మూర్తికి అందంగా అలంకరించారు.

అనంతరం పార్వేట ఉత్సవాలు ఆరంభం అయ్యాయి. శ్రీమలయప్పస్వామి, శ్రీ కృష్ణస్వామివారు వేర్వేరు తిరుచ్చిలపై పార్వేట మంటపానికి వేంచేశారు. స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. పూజాదికాల అనంరం మలయప్పస్వామివారు వేటకు వెళ్లారు. స్వామివారి తరపున అర్చకులు ఈటె విసిరారు. మూడుసార్లు ఈటెను సంధించారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే ఈ విశేష వేడుకలను చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో పార్వేట మండపానికి తరలివచ్చారు.
ఈ ఉత్సవంలో టిటిడి అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాల నేపథ్యంలో టీటీడీ ఆర్జిత సేవలను రద్దు చేసింది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు రద్దయ్యాయి.












Click it and Unblock the Notifications