ఇదీ పవన్ వ్యూహం: జనసేన కోసం రంగంలోకి మీడియా అధినేత!?..
ఇప్పటిదాకా చంద్రబాబుతో సఖ్యతగా మెలుగుతూ వచ్చి.. 2019లో టీడీపీకి దూరంగా జరిగితే ఎలాంటి ప్రతికూలతలు ఏర్పడుతాయనేదిపై కూడా పవన్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే..
హైదరాబాద్: నయా రాజకీయాల తీరు తెన్నులకు మీడియాకు మధ్య సత్సంబంధాలు.. కొన్ని విషయాలను పరోక్షంగా స్పష్టం చేస్తుంటాయి. పార్టీల ఎజెండాలను భుజానికెత్తుకుని వాటికి ప్రాధాన్యం కల్పించడంలో ఈ విషయం స్పష్టమవుతుంది. భవిష్యత్తు వ్యూహాలకు వారధిగా మీడియా ఒక నిర్మాణంలా పనిచేయడం రాజకీయాల్లో ఇప్పుడు చాలా పార్టీలకు ఓ అనివార్యత.
'ముందస్తు'కు సిద్దమన్న జనసేన; గద్దర్కు సూటి ప్రశ్న, పవన్ ఏమన్నాడో గుర్తుందా?
బహుశా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లున్నారు. ఏకకాలంలో అటు పార్టీ నిర్మాణంతో పాటు.. పార్టీ పట్ల ప్రజలకు ఒక స్థిరాభిప్రాయం ఏర్పడేలా ఇటు మీడియాతోను సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఓ ప్రముఖ మీడియా ఛానెల్ పవన్ కళ్యాణ్ వార్తలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తోందన్న వాదన బలంగా వినిపిస్తోంది.
2019వ్యూహంతోనే?:
2019ఎన్నికల్లో పవన్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారనే దానిపై చాలా విశ్లేషణలే తెరపై ఉన్నాయి. టీడీపీతో ఆయనకు రహస్య ఎజెండా ఉందని, పైకి మాత్రం విభేదిస్తున్నట్లుగా కనిపిస్తారనేది అందులో ఓ వాదన. మరో వాదన ఏంటంటే.. వచ్చే ఎన్నికల్లో హోదా అంశం కీలక మారబోతుంది కాబట్టి, హోదాపై గొంతెత్తే పార్టీలతో ఆయన కలిసి నడిచే అవకాశముంది. ఆ క్రమంలో ఆయన జగన్ కు కూడా దగ్గరగా జరగవచ్చేమో అన్న అభిప్రాయాలు ఉన్నాయి.
సరే, వ్యూహం ఎలాంటిదైనా.. జనసేన, పవన్ ఆలోచనలను ఎప్పుడూ జనంలో చర్చకు పెట్టేలా ఓ మాద్యమం ఉంటే బాగుంటుందని పవన్ ఆలోచించినట్లుగా తెలుస్తోంది. ఆ క్రమంలోనే ప్రముఖ టీవీ ఛానెల్ ఒకటి జనసేనకు ఇప్పటినుంచే ప్రాధాన్యం పెంచినట్లు చెబుతున్నారు. జనంలో పవన్ పట్ల మరింత సానుకూల వైఖరి ఏర్పడేలా సదరు ఛానెల్ పనిచేస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాజకీయ సలహాదారుగా:
ఇప్పటివరకు జనసేన అంటే ఏకవ్యక్తి పార్టీగానే ముద్రపడిపోయింది. కొన్ని కార్పోరేట్ కంపెనీలు ఆయన్ను స్పాన్సర్ చేస్తున్నట్లుగా అప్పట్లో వార్తలు కడా వచ్చాయి. పవన్ రాజకీయంగా తమకు ప్రతికూలంగా మారుతున్నాడని తెలిస్తే.. అధికార టీడీపీ ఆయన పట్ల ఎలా వ్యవహరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
టీడీపీకి ఉన్న ప్రధాన బలం మీడియా. కాబట్టి ముందస్తు ప్రణాళికలో భాగంగా.. ఈ ఎత్తుల్ని ఎదుర్కోవడానికి పవన్ 'మీడియా' ప్రాధాన్యతను గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పేరున్న ఓ మీడియా సంస్థ అధినేతను ఆయన తన రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రతికూలతలను ఎదుర్కోవడానికే:
హోదాపై పవన్ పోరాటం ట్విట్టర్ కే పరిమితమైందన్న విమర్శ ఉంది. దాంతో పాటు అటు టీడీపీ పట్ల ఆయన వైఖరి ఇంతవరకు స్పష్టం కాలేదు. అటు చంద్రబాబు.. ఇటు పవన్.. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న దాఖలా లేదు. మధ్యలో పార్టీ నేతలే పవన్ పై విరుచుకుపడ్డా.. చంద్రబాబు వారిని సైలెంట్ చేశారు.
ఈ నేపథ్యంలో.. ఇప్పటిదాకా చంద్రబాబుతో సఖ్యతగా మెలుగుతూ వచ్చి.. 2019లో టీడీపీకి దూరంగా జరిగితే ఎలాంటి ప్రతికూలతలు ఏర్పడుతాయనేదిపై కూడా పవన్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే.. రాజకీయ సలహాదారు అవసరమని పవన్ భావించినట్లుగా సమాచారం. అందువల్లే మీడియా అధినేతతో ఆయన చేతులు కలిపారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వామపక్షాలతో కలుస్తారా?:
హోదా విషయంలో పవన్ ఇప్పటిదాకా స్పందించిన తీరు చూస్తే.. బీజేపీని ఆయన దూరం పెట్టినట్లుగానే కనిపిస్తోంది. అదే సమయంలో వామపక్షాలతో కలిసి నడవడానికి ఆయన సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన పూర్తి స్థాయిలో పోటీ చేస్తుందా? లేక పవన్ ఒక్కరే పోటీ చేస్తారా? అన్నదానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు.
ఇప్పుడిప్పుడే.. రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు ద్వారా కార్యకర్తలను ఎంపిక చేసుకుంటున్న పవన్.. వారిలో కొంతమందిని వచ్చే ఎన్నికల కోసం సిద్దం చేస్తారా? అన్నది కూడా ఆసక్తికరం. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో పవన్ రాజకీయం కీలక పాత్ర పోషించినన్నుట్లు అర్థమవుతోంది.