పవన్ మారాడు.. మరి జగన్? : ఇదే తీరు కొనసాగిస్తే.. వైసీపీకి జనసేన దెబ్బ తప్పదు!
విజయవాడ : రాజకీయాల్లో విమర్శలు అత్యంత సహజం. అయితే సద్విమర్శలను విస్మరించడం కన్నా.. వాటినుంచి పాఠాలు నేర్చుకున్నప్పుడే.. రాజకీయంగా మరో మెట్టు పైకి ఎక్కగలరు. ఈ విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరిణతితో వ్యవహరించినట్టుగానే కనిపిస్తోంది.
మొన్నామధ్య నిర్వహించిన తిరుపతి, కాకినాడ బహిరంగ సభలకు నిన్న అనంతపురంలో నిర్వహించిన సభకు.. అలాగే నేటి ఉదయం గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో పవన్ మాట్లాడిన తీరును పోల్చి చూసుకుంటే.. మునుపటి ఆవేశాన్ని పూర్తిగా పక్కనబెట్టేసి.. స్పష్టమైన అవగాహనతో పవన్ మాట్లాడినట్టుగా అర్థమవుతోంది.
ఇంతకుముందు సభలల్లో పవన్ ఇంత క్లారిటీగా మాట్లాడినట్టు అనిపించదు. హడావుడిగా వేదిక మీదికెక్కి.. మాట్లాడాల్సిన లైన్ నుంచి పక్కకుపోయి.. ఏదేదో మాట్లాడేసి ముగించేశారు అన్నట్టుగానే గత సభల్లో ఆయన ధోరణి కొనసాగింది. కానీ గత సభలకు, నిన్నటి సభకు స్పష్టమైన తేడా ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కీలకమైన హోదా, పోలవరం వంటి అంశాలపై పవన్ లోతుగా అధ్యయనం చేసి మరీ మాట్లాడడం వల్ల.. ఆయన మాటల్లో విశ్వసనీయతను ప్రజలు గమనించే అవకాశముంది.

నిపుణల అభిప్రాయాలు తెలుసుకోవడం.. విశ్లేషకులతో సమాలోచనలు జరపడం వంటి విషయాలకు అంతర్గతంగా పవన్ ప్రాధాన్యం ఇస్తున్నారు కాబట్టే.. నిన్నటి సభలో ఆయన మాటలు జనాలను ఆకట్టుకోవడమే కాదు.. ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రకటనల పట్ల చైతన్యం కలిగించేవిగా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది.
జగన్ తీరులో మాత్రం మార్పు రాలేదు :
విషయమేదైనా సరే.. దాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ఆకట్టుకునే మాట తీరుతో పాటు చెప్పే మాటలో బలమైన విషయం ఉండాలి. అలా కాకుండా.. చెప్పిన విషయాన్నే పదేసి సార్లు చెబితే.. జనాలకు కూడా విసుగొచ్చే పరిస్థితి నెలకొంటుంది. నిజానికి జగన్ ఇన్నాళ్ల నుంచి ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తున్నా.. నిన్న పవన్ ప్రస్తావించిన అంశాలపై.. అంత క్లారిటీగా జగన్ ఎప్పుడూ వివరించలేదు.
ప్రజలకు వాస్తవాలెంటో చెప్పడం కన్నా.. ఎక్కువగా ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు జగన్. ఈ పరంపరలో ఆయన వ్యక్తిగత విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు తప్పితే.. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై లోతైన అధ్యయనం చేయట్లేదు అన్న వాదన వినిపిస్తోంది. అలాగే జనంలోకి చొచ్చుకెళ్లే తీరులోను పవన్ కంటే జగన్ వెనుకబడిపోతున్నారన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.
పవన్ పాదయాత్ర ప్రకటనే ఇందుకు నిదర్శనం. త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని జనంలోకి వెళ్లడంలో పవన్ జగన్ కంటే దూకుడును కనబరుస్తున్నారు. మొన్నీమద్యే.. భీమవరం సమీపంలో ఏర్పాటు చేయబోతున్న ఆక్వా ఫ్యాక్టరీ విషయంలోను ప్రతిపక్షం కన్నా ముందే స్పందించారు పవన్. ఈ లెక్కన వైసీపీ అధినేత జగన్ ఇప్పటినుంచి అప్రమత్తంగా వ్యవహరించకపోతే గనుక.. భవిష్యత్తులో ఆ పార్టీకి జనసేన దెబ్బ తప్పదంటున్నారు పలువురు.












Click it and Unblock the Notifications