వెనుకబాటు.. బీజేపీ అలా, జగన్ ఇలా: పవన్ కళ్యాణ్పై యుద్ధం!
అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పైన వరుసగా సభలు నిర్వహిస్తుండటంతో ఇటు బీజేపీ, అటు వైయస్సార్ కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడిపోయినట్లుగా కనిపిస్తోంది. ఈ కారణంగానే హోదా పైన బీజేపీ వివరణ, వైసిపి మరింత ఉద్యమం కొనసాగిస్తోంది.
ప్రత్యేక హోదా ఇవ్వమని, దానికి కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని బీజేపీ చెప్పింది. ఆ తర్వాత కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ బీజేపీ పైన దుమ్మెత్తి పోశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు హోదాను మించిన ప్యాకేజీ ఇస్తున్నామని చెబుతున్నారు.
అయితే, దీని పైన వారు పదేపదే వివరణ ఇచ్చుకుంటున్నారు. తాజాగా, అనంతపురంలో నవంబర్ 10న పవన్ ప్రత్యేక హోదా పైన సభను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు కాకినాడలో ప్రత్యేక హోదా, నిధుల విషయమై బీజేపీ సభ నిర్వహించింది.
పవన్ తొలి సభను తిరుపతిలో, ఆ తర్వాత కాకినాడలో నిర్వహించారు. కాకినాడలోనే బీజేపీ పైన విరుచుకు పడ్డారు. ఈ రోజు అదే కాకినాడలో కేంద్రమంత్రి వెంకయ్య మాట్లాడుతూ.. హోదా బదులు దానికి సరిపడా ప్యాకేజీని ఇస్తున్నట్లు ఇస్తున్నట్లు పునరుద్ఘాటించారు.
మరోవైపు, ప్రత్యేక హోదా విషయమై అప్పుడప్పుడు పవన్ సభలు నిర్వహిస్తున్నప్పటికీ అది చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే యువభేరీ సభలతో హోదా పైన నిలదీస్తున్న జగన్.. తాజాగా ఆదివారం నాడు విశాఖలో ప్రత్యేక హోదా సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
పవన్ సభలతో బిజెపి, వైసిపి ఆత్మరక్షణలో పడ్డాయని, అందుకే బీజేపీ వివరణ మీద వివరణలు ఇస్తోందని, వైసిపి వెనుకబడ్డామనే భావన లేకుండా సభ నిర్వహిస్తోందని అంటున్నారు. తద్వారా పరోక్షంగా పవన్ పైన ప్రత్యేక యుద్ధం చేస్తున్నారని అంటున్నారు.