సీఎం జగన్ కు ఆ వర్గాలు దూరం -ఒంటరే : సీఎం అభ్యర్దిగా - వార్ వన్సైడు : పవన్ కళ్యాణ్..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలు.. కోనసీమ విధ్వంసం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. అదే సమయంలో బీజేపీతో సంబంధాలు..తనను సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తారనే అంశం పైన స్పందించారు. ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని పవన్ జోస్యం చెప్పారు. కోనసీమ అల్లర్లపై కేంద్రం ముందుగానే హెచ్చరించిందన్నారు. ముఖ్యమంత్రి ఇంతవరకు దీనిపై స్పందించకపోవడం, డీజీపీ కూడా పట్టించుకోకపోవడం.. మంత్రులు ఎవరూ అక్కడికి వెళ్లకపోవడం చూస్తోంటే కావాలనే చేశారనే అభిప్రాయం తనకు ఏర్పడిందని చెప్పుకొచ్చారు.

జగన్ ఒంటరిగా మిలుగుతున్నారు
ఒకవేళ జనసేన వారే ఇందులో ఉంటే అరెస్టు చేయండని వ్యాఖ్యానించారు. ఆస్తుల విధ్వంసానికి బాధ్యుల నుంచి రికవరీ చేయించాలనే ఆలోచన మంచిదేనని అభిప్రాయపడ్డారు. ముందు వైసీపీ వారిని ఇందుకు బాధ్యులను చేయాలని డిమాండ్ చేసారు.
ఇప్పటికే వైసీపీ కాపులను, బీసీలను, మత్స్యకారులను, కమ్మ వర్గాలను వర్గ శత్రువులుగా ప్రకటించిందంటూ పవన్ పేర్కొన్నారు. అన్ని కులాలూ మతాలూ కలసి ఓటేస్తేనే వైసీపీకి 151 స్థానాలు దక్కాయని పవన్ పేర్కొన్నారు. కానీ... జగన్ వర్గ రాజకీయాలు చేస్తూ ఒక్కొక్కరిని దూరం చేసుకుంటున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాలు కూడా దూరమవుతున్నాయని... చివరికి జగన్ ఒంటరిగా మిగులుతారని పవన్ పేర్కొన్నారు.

వైసీపీని ఈ సారి గెలిపించరు
సహచర మంత్రి పినిపె విశ్వరూప్, వెనుకబడిన కులానికి చెందిన ఎమ్మెల్యే సతీశ్ల ఇళ్లకు నిప్పుపెడితే.. జగన్ స్వయంగా వెళ్లి ఎందుకు పరిశీలించలేదని నిలదీశారు. డీజీపీ అప్పాయింట్ మెంట్ ఇవ్వకపోతే కేంద్ర హోం మంత్రి అమిత్షాకు ఆయనపై ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేసారు. తనను బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రతిపాదిస్తుందనే అంశం పైన స్పందించిన పవన్ తాను గాల్లో మేడలు కట్టను.
ఇదంతా ప్రచారం మాత్రమే..అంటూ సమాధానమిచ్చారు. జేపీ నడ్డా ఏపీకి వచ్చిన సమయంలో కలిసే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారు. రోజూ భయంతో బతకాలని ఎవరూ అనుకోరని చెప్పిన జనసేనాని.. అందుకే... వైసీపీని ప్రజలు మరోసారి గెలిపించరని చెప్పుకొచ్చారు.

చంద్రబాబు వ్యాఖ్యలు .. మంచిదే కదా
వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనన్న మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. ఈ విషయం పదేపదే చెప్పాల్సిన అవసరం లేదని పవన్ తేల్చి చెప్పారు. చంద్రబాబు మహానాడుకు ముందు జనసేనతో వన్సైడ్ లవ్ అనటం... మహానాడు తర్వాత వార్ వన్సైడు అనటం పైన స్పందించిన పవన్.. సంతేషమే కదా అంటూ బదులిచ్చారు. ఇక, ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న మెగా బ్రదర్ నాగబాబు తాను వచ్చే ఎన్నికల్లో ఎంపీ..ఎమ్మెల్యేగా పోటీ చేయనని ప్రకటించారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో జరిగే ముఖ్యనేతల సమావేశంలో పార్టీ అధినేత పవన్ కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications