కెవిపి ప్రత్యేక హోదా బిల్లుపై దాటవేత: బిజెపిపై పవన్ కల్యాణ్ గుర్రు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రతిపాదిస్తూ కాంగ్రెసు సభ్యుడు కెవిపి రామచందర రావు పెట్టిన ప్రైవేట్ బిల్లుపై బిజెపి అనుసరించిన వైఖరి పట్ల పవన్ కళ్యాణ్ గుర్రుగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కెవిపి బిల్లు విషయంలో బిజెపి దాటవేత దోరణిని అవలంబించిందని ఆయన అభిప్రాయపడుతున్నట్లు వినికిడి.
కెవిపి ప్రతిపాదించిన బిల్లుపై చర్చ జరగకుండా బిజెపియే చేసిందని ఆయన అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు. తాను ఇంత కాలం మాట్లాడకుండా ఉండడానికి కూడా బిజెపి, టిడిపిల దాటవేత వైఖరే కారణమని ఆయన అంటున్నట్లు చెబుతున్నారు.
కెవిపి ప్రతిపాదించిన బిల్లుతో కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టమైందని, ఇక బిజెపిపై విమర్సలు చేయడానికి వెనుకంజ వేసేది లేదని ఆయన అంటున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని కూడా ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.
గత ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపి కూటమికి మద్దతు ఇచ్చిన పవన్ కల్యాణ్ ఆ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ సమస్యలపై స్పందిస్తూ వచ్చారు. రాజధానికి భూసేకరణ, ప్రత్యేక హోదా, కాపు రిజర్వేషన్ల వంటి అంశాలపై ఆయన ట్విట్టర్ వేదికగానే కాకుండా మీడియా సమావేశాలు పెట్టి కూడా మాట్లాడారు. అయితే, తిరిగి ప్రత్యేక హోదా అంశం తెర మీదికి వచ్చిన నేపథ్యంలో మాత్రం మౌనంగా ఉంటున్నారు.
బిజెపికి, టిడిపికి వ్యతిరేకంగా రాజకీయాలను సానబెట్టేందుకు ఆయన పథక రచన చేసుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వివిధ సందర్బాల్లో పవన్ కల్యాణ్ స్పందించిన తీరు కోసం స్లైడ్ చూడండి.

ప్రత్యేక హోదాపై ఏప్రిల్లో....
ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి కాంగ్రెస్ తప్పు చేసిందని అన్నారు. పార్లమెంటులో ఎంపీలను బయటికి గెంటి రాష్ట్రాన్ని విభజించిందని పవన్ కల్యాణ్ చెప్పారు. సీమాంధ్ర ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఎవరూ మర్చిపోరని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ సీమాంధ్రుల నమ్మకాన్ని వమ్ము చేయదని ఆశిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.

మోడీపై ఏప్రిల్లో...
దేశానికి మంచి నాయకుడు అన్న ఒకే ఒక కారణంతో తాను నరేంద్ర మోడీకి నాడు మద్దతు పలికానని జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పారు. తనకు బిజెపిలో చేరే ఉద్దేశ్యం ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. తన తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో కులం పైన చెప్పిన డైలాగులు కేవలం సినిమా కోసమేనని, అవి తన వ్యక్తిగత అభిప్రాయాలుగా తీసుకోవద్దని కోరాడు. తాను జనసేన పార్టీని ప్రకటించిన సమయంలో కాపుల రిజర్వేషన్ అంశం తెరపై లేదని, ఉంటే అప్పుడే తన వైఖరిని బయటపెట్టి ఉండేవాడినని చెప్పారు.

ప్రత్యేక హోదాపై ఏప్రిల్లో...
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం పోరాడుతానని ఆయన చెప్పారు. ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని పేర్కొన్నారు. నెల గడవడమే కష్టంగా ఉందని, తన సిబ్బందికి జీతాలు చెల్లించాలన్నా ఇబ్బందిగా ఉన్నట్లు చెప్పారు.

రోహిత్ ఆత్మహత్యపై ఫిబ్రవరిలో....
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ రోహిత్ ఆత్మహత్య బాధాకరమని పవన్ కల్యాణ్ అన్నారు. మన విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష ఉందనేది నిజమన్నారు. అయితే దానిని రాజకీయం చేయడం సరికాదన్నారు. తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆదుకునేందుకు వస్తాననే వాదనలో నిజం లేదని, దానిని తాను ఒప్పుకోనని జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం నాడు చెప్పారు.

తుని ఘటనపై ఫిబ్రవరిలో
తుని ఘటన చాలా బాధాకరమని పవన్ కల్యాణ్ అన్నారు. ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలన్నారు. అప్పుడే విజయవంతం అవుతుందన్నారు. తెలంగాణలో, కోస్తాంధ్రలో వెనుకబడిన వర్గాలను గుర్తించాలన్నారు. కాపులను బీసీల్లో చేర్చుతామని నాయకులు హామీలు ఇచ్చి వదిలేస్తున్నారనే అభిప్రాయం కాపుల్లో ఉందన్నారు. తమకు అన్యాయం జరుగుతుందని చెప్పుకునేందుకు ఏర్పాటైన సభ, శాంతియుతంగా ఉండాల్సిన సభ.. విధ్వంసం కావడం బాధాకరమన్నారు.

అమరావతిపై 2015 అక్టోబర్లో...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి హైదరాబాదులో కాకూడదని ఆశిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎపి మంత్రులు అయన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్ శనివారం ఉదయం పవన్ కళ్యాణ్ను కలిసి ఆయనకు అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రాన్ని అందించారు.

మద్దతుపై 2015 ఆగస్టులో...
తనకు తండ్రి తర్వాత తండ్రి వంటి అన్నయ్య (చిరంజీవి) మనసును గాయపర్చి తాను గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి - బిజెపికి మద్దతిచ్చానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం అన్నారు. పెనుమాకలో రైతులతో మాట్లాడిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజల కోసమే తాను టిడిపి - బిజెపికి మద్దతిచ్చానని తెలిపారు.

భూసేకరణపై 2015 ఆగస్టులో
చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తే తాను ఖచ్చితంగా ధర్నా చేస్తానని, నిరాహార దీక్ష చేస్తానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. నాడు వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో భూకుంభకోణాలు జరిగాయని, ఇప్పుడు చంద్రబాబు అలాగే చేస్తే మీకు, ఆయనకు తేడా ఏమిటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పెనుమాక గ్రామంలో రైతులను సమస్యలు అడిగిన తర్వాత సుదీర్ఘంగా మాట్లాడారు.

భూసేకరణపై 2015 ఆగస్టులో...
ఆంధ్రప్రదేశ్ చేయతలపెట్టిన భూసమీకరణ పైన జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బుధవారం మరోసారి స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన మరోసారి వరుస ట్వీట్లు చేశారు. బలవంతంగా వద్దని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు.

రైతు ఆత్మహత్యపై 2015 ఆగస్టులో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం ఆత్మబలిదానం చేసుకున్న మునికోటి అంశంపై జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదా పైన విపక్షాలు నిత్యం పవన్ కళ్యాణ్ను నిలదీస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ వేదిక ద్వారా స్పందించారు. మునికోటి చనిపోవడం నాకు చాలా బాధ అనిపించిందని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు.

ప్రత్యేక హోదాపై 2015 జులైలో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కాంగ్రెస్ పార్టీ గాలికి వదిలేసిందని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించారు. ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ విషయంలో అధికార భారతీయ జనతా పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ బాగానే పోరాడిందని, కానీ ఐదు కోట్ల ఆంధ్రా ప్రజల కోసం ఎందుకు పోరాడటం లేదని ఎద్దేవా చేశారు.

ఎంపీలపై 2015 జులైలో
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల పైన మరోసారి బాంబు పేల్చారు. ట్విట్టర్లో వరుసగా కామెంట్లు చేస్తూ నిలదీస్తున్న పవన్.... గురువారం నాడు మరో బాంబు పేల్చారు. మార్చి 17-2015 నాడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు పార్లమెంటులో పెట్టినప్పుడు ఎంతమంది సీమాంధ్ర ఎంపీలు హాజరయ్యారని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.

ప్రత్యేక హోదాపై 2015 జులైలో...
తెలంగాణ ఎంపీలను స్ఫూర్తిగా తీసుకొని సీమాంధ్ర ఎంపీలు ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని, లేదంటే రాజీనామా చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా పైన ఇప్పుడు ఎవరు మాట్లాడటం లేదన్నారు. ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగడం లేదన్నారు. బీజేపీకి ఇద్దరు ఎంపీలు ఉన్నారని, వారు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. వివిధ సందర్భాల్లో బాగా మాట్లాడే నేతలు ఇప్పుడేం మాట్లాడటం లేదన్నారు.

భూసేకరణపై 2105 మేలో...
ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసేకరణ చట్టం పైన జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటే, ఆ చట్టాన్ని రైతుల పైన రుద్దితే తాను రంగంలోకి దిగుతానని హెచ్చరించారు. భూసేకరణ చట్టాన్ని బలవంతంగా రుద్దితే తాను తప్పకుండా రైతుల తరఫున ముందుకు వస్తానని గతంలోనే పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు ఆయన మరోసారి స్పందించారు.












Click it and Unblock the Notifications