పవన్ కళ్యాణ్ దిగజారారు, ఫ్యాన్స్ గందరగోళం: అంబటి, ఎయిర్ పోర్ట్లో పట్టించుకోకుండా..
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గురువారం మండిపడ్డారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారనుకుంటే.. ఆయన అధికార ప్రతినిధిగా మాట్లాడారని ఎద్దేవా చేశారు.
ప్రశ్నించేందుకే తాను జనసేన పార్టీని స్థాపించానని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఆ పని మానేసి, రాజీ ధోరణిలో ఉన్నారన్నారు. ఆ దృష్టి మరల్చేందుకే బాబు-పవన్ కళ్యాణ్లు భేటీ అయ్యారన్నారు. అదంతా ఓ డ్రామాగా ఉందన్నారు.
పవన్ కళ్యాణ్తో మాట్లాడేందుకు గన్నవరం విమానాశ్రయానికి రైతులు వస్తే ఆయన మాత్రం విమానం దిగిన వెంటనే నేరుగా కారులో చంద్రబాబు వద్దకు వెళ్లారన్నారు. రైతుల గోడు వినేందుకు కూడా పవన్ కళ్యాణ్ ప్రయత్నించలేదన్నారు.
వారిద్దరి భేటీపై ఆశలు పెట్టుకున్న రాజధాని ప్రాంత రైతులకు పవన్ కళ్యాణ్ నిరాశే మిగిల్చారన్నారు. అసలు రైతుల సమస్యలను చంద్రబాబుకు ఎందుకు చెప్పలేదో చెప్పాలన్నారు. బాక్సైట్ తవ్వకాలపై పవన్ కళ్యాణ్కు ఏమాత్రం అవగాహన లేదన్నారు.
ప్రశ్నించేందుకే తాను పార్టీని పెట్టానన్న పవన్ కళ్యాణ్ కిందిస్థాయికి దిగజారిపోయారన్నారు. జనసేన ఎందుకు మారిపోయిందో దానిని నమ్ముకున్న అభిమానులకు అర్థం కాని స్థితిలో ఉందన్నారు. కాగా, మధ్యాహ్నం చంద్రబాబు - పవన్ కళ్యాణ్ భేటీ అయిన విషయం తెలిసిందే.
గుణపాఠం నేర్వాలి: రఘువీరా రెడ్డి
బీహార్ ఎన్నికల ఫలితాలతో టిడిపి, బిజెపి గుణపాఠం నేర్వాలని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లాలని డిమాండ్ చేశారు.