అంతా ఆయన వల్లే.. ఢిల్లీలో కుదుపు వెనుక.. పవన్ 'రెండు' దెబ్బలు: బీజేపీకి చుక్కలు
అమరావతి/హైదరాబాద్: ఇప్పుడు దేశవ్యాప్తంగా అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. టీడీపీ, వైసీపీలు కేంద్రంపై రెండు రోజులుగా ఈ నోటీసులు ఇస్తున్నారు. ఈ పార్టీలకు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ తదితర ఎన్నో పార్టీలు మద్దతిస్తున్నాయి.
ఢిల్లీ స్థాయిలో ఇప్పుడు అవిశ్వాస అలజడికి కారణం ఎవరా అని తరిచి చూస్తే అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఓ విధంగా ఇప్పుడు ఆయన చేసిన సవాల్, అలజడి అధికార, ప్రతిపక్షాల్లో కలకలం రేపుతోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే పరోక్షంగా బీజేపీకి చుక్కలు కనిపిస్తోంది పవన్ వల్లే.
జగన్కు పవన్ కళ్యాణ్ సవాల్
ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ, వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చు కదా అని కొద్ది రోజుల క్రితం పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే స్పందించిన జగన్ తాను అవిశ్వాసం పెడతానని, అయితే పవన్ ఎంపీలను కూడగడతారా అని ప్రశ్నించారు.
రాజకీయం అని చెప్పిన టీడీపీ
మార్చి 5వ తేదీన అవిశ్వాసం పెడతానంటే తాను మార్చి 4నే ఢిల్లీకి వచ్చి ఎంపీల మద్దతు కూడగడతానని పవన్ ప్రకటించారు. అయితే టీడీపీ ఎంపీల మద్దతు కూడగట్టాలని వైసీపీ లంకె పెట్టింది. వైసీపీ అవిశ్వాసంపై టీడీపీ తొలుత వ్యతిరేకత ప్రదర్శించింది. దీని వెనుక రాజకీయ కారణాలు అని ఆగ్రహించింది.
టీడీపీ యూటర్న్.. రెండో దెబ్బకు పవనే కారణం
వైసీపీ అవిశ్వాసం పెడతామని చెప్పడానికి పవన్ కారణం. అలాగే ఈ అంశంపై టీడీపీ యూటర్న్ తీసుకోవడానికి కూడా ఓ రకంగా జనసేనానే కారణం. అప్పటికే కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ ఇద్దరు ఎంపీలు తప్పుకున్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకు వేచి చూసి ఆ తర్వాత ఎన్డీయే నుంచి తప్పుకుందామని భావించారు. కానీ అంతలోనే పవన్ గుంటూరు సభలో టీడీపీని ఏకిపారేశారు. దీంతో ఆయన వెనుక పవన్ ఉన్నారని, జగన్ -పవన్ - బీజేపీ కలిసి పని చేస్తోందని అనుమానించి, మరుసటి రోజే ఎన్డీయే నుంచి తప్పుకొని అవిశ్వాసం పెట్టింది. ఇలా టీడీపీ యూటర్న్కు కూడా జనసేనాని కారణం.
పవన్ ఒక్క సవాల్తో జాతీయ రాజకీయాల్లో కుదుపు
పవన్ రేపిన చిచ్చు ఇప్పుడు జాతీయ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. టీడీపీ, వైసీపీలకు జనసేనాని చేసిన సవాల్ ఇప్పుడు ఒక్కసారిగా జాతీయ రాజకీయాలను మార్చివేస్తున్నాయి. అవిశ్వాసం పెడితే మోడీ ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు. కానీ వివిధ కారణాలతో మోడీని, బీజేపీని వ్యతిరేకించే వారంతా ఏకమవుతున్నారు. టీడీపీ లేదా వైసీపీ పెట్టే అవిశ్వాసానికి కాంగ్రెస్, లెఫ్ట్ తదితరులు మద్దతిస్తున్నారు.
మోడీని ఇబ్బందుల్లోకి నెట్టిన పవన్ కళ్యాణ్ దూకుడు
పవన్ కళ్యాణ్, జగన్లతో కలిసి బీజేపీ తనను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కానీ అవిశ్వాసం విషయంలో పవన్ దూకుడు ఇప్పుడు మోడీని ఇబ్బందుల్లోకి నెట్టింది.
చంద్రబాబుపై తీవ్రంగానే
ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా గళమెత్తుకోవడంపై బీజేపీ, ఏపీలో అవినీతిపై పవన్ కళ్యాణ్ ఘాటుగానే స్పందిస్తున్నాయి. చంద్రబాబు అవసరానికి వాడుకొని వదిలేసే రకమని తనకు తెలుసునని పవన్ గతంలో చెప్పారు. తాజాగా, బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మాట్లాడుతూ.. చంద్రబాబు కంటే రాజకీయ క్రీడ ఆడేవారు ఎవరూ లేరని, పొలిటికల్ జిమ్మిక్స్కు ఆయన ఫేమస్ అని మండిపడ్డారు.