కరోనా విముక్త భారతం కోసం ప్రధాని మాట పాటిద్దాం: జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు
కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జన సైనికులే కాక తెలుగువారందరూ పీఎం చేసిన సూచనలు పాటించాలని ఆయన కోరారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనతా కర్ఫ్యూను అందరం పాటిద్దాం అని పేర్కొన్నారు.

జనతా కర్ఫ్యూలో అంతా పాల్గొనాలని పవన్ పిలుపు
ఈ నెల 22వ తేదీ ఆదివారం రోజున ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఇళ్లకే పరిమితం అవుదామని , కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి మన వంతు ప్రయత్నం చేద్దామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రమాదమని తెలిసినప్పటికీ క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు,మీడియా వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సాటి మనిషిగా కరోనాపై పోరాటానికి సంఘీభావం తెలపాలి
ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు మన ఇంటి బాల్కనీలో నిలబడి కరతాళధ్వనులు ద్వారా వారికి సంఘీభావం తెలుపుదామని పేర్కొన్నారు. 2001 సెప్టెంబర్ 11న ట్విన్ టవర్స్ ను టెర్రరిస్టులు కూల్చినప్పుడు మరణించిన వారికి అంజలి ఘటించటానికి అమెరికన్లు అందరూ ఒకేసారి రోడ్లపైకి వచ్చి మృతులకు సంతాపం తెలిపారని, ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని, తాను అమెరికన్ కానప్పటికీ సాటి మనిషిగా సంఘీభావంగా తాను అక్కడే ఉన్నానని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
Recommended Video

మోడీ పిలుపుమేరకు దేశమంతా స్పందించాలన్న పవన్
సామాజిక సంఘీభావ కార్యక్రమంలో మనమంతా మమేకం కావడం విధిగా భావిస్తాను అని పేర్కొన్న పవన్ కళ్యాణ్ మోడీ పిలుపుమేరకు దేశమంతా స్పందించాలని కోరుకుంటున్నానని తెలిపారు. నేను సైతం ఆ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఫేస్ బుక్ లైవ్ ద్వారా మీ ముందుకు వస్తానని పేర్కొన్నారు. కరోనా పై పోరాటంలో మన దృఢ చిత్తాన్ని చాటుకోవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రధాని మాట పాటిద్దామని, కరోనా విముక్త భారతాన్ని సాధిద్దామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications