షాక్: పార్టీని నమోదు చేయలేని పవన్ కళ్యాణ్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించ తలపెట్టిన జనసేన పార్టీకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఎన్నికల కమిషన్ వద్ద ఆయన పార్టీ నమోదుకు ఇబ్బంది ఎదురవుతోంది. పార్టీ నమోదుకు ఎన్నికల కమిషన్ (ఈసి) నిరాకరించినట్లు సమాచారం. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు నిరాశకు గురయ్యారు.
పార్టీ నమోదుకు కనీసం మూడు నుంచి నాలుగు నెలల కాలం పడుతుందని భావిస్తున్నారు. లోకసభ, శాసనసభ ఎన్నికల తేదీలు విడుదల కావడంతో పవన్ కళ్యాణ్కు సమయం లేకుండా పోయింది. తెలంగాణలో ఎన్నికలకు ఎప్రిల్ 2వ తేదీన, సీమాంధ్రలో ఎన్నికలకు ఏప్రిల్ 12వ తేదీన నోటిఫికేషన్లు జారీ అవుతాయి. తెలంగాణలో ఏప్రిల్ 30వ తేదీన, సీమాంధ్రలో 7వ తేదీన పోలింగ్ జరుగుతుంది.
పవన్ కళ్యాణ్ పార్టీ నమోదుకు సంబంధించి టైమ్స్ ఆఫ్ ఇండియా బుధవారం ఓ వార్తాకథనాన్ని ఇచ్చింది. జన సేన పార్టీ పేరు మీద ఏ పార్టీ కూడా రిజిష్టర్ కాలేదని తమకు ఈసి వర్గాలు చెప్పినట్లు ఆ మీడియా సంస్థ రాసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం - పార్టీ నమోదుకు ఈసికి మార్చి 10వ తేదీన దరఖాస్తు వచ్చింది. దరఖాస్తు చేసుకున్నంత మాత్రాన పార్టీ పేరు నమోదైనట్లు కాదు.
పార్టీ నమోదుకు నెల రోజుల వ్యవధి ఇస్తూ పత్రికా ప్రకటన జారీ అవుతుంది. దీన్నిబట్టి పవన్ కళ్యాణ్ పార్టీ ఈసి వద్ద నమోదయ్యే అవకాశాలు లేవు. కొత్త ఫేస్బుక్ పేజీతో పవన్ కళ్యాణ్ బుధవారంనాడు జనసేన పార్టీ పేరుతో ప్రజల ముందుకు వచ్చారు. టెక్నికల్ కలర్తో పవన్ కళ్యాణ్ అగ్రహోదగ్ర రూపంతో గల చిత్రాన్ని ఇచ్చారు. "Pawanism4change" అనే వివరణ కూడా బిగించిన పిడికిలితో పేజీపై ఉంది. లీడర్షిప్ ఈజ్ యాక్షన్, నాట్ ఏ పొజిషన్ అని ఉంది. పవన్ కళ్యాణ్ను చేగువేరాలా చూపించారు.