జగన్! నాతో వస్తావా, మురళీమోహన్! హేళనగా ఉందా?: టీడీపీకి పవన్ దిమ్మతిరిగే సవాల్
విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ రైల్వే జోన్పై మాట్లాడటం లేదన్న టిడిపి నేతలకు జనసేనాని గట్టి సవాల్ విసిరారు. ఆయన తగరపువలసలో జనసేన పోరాట యాత్రలో పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
విశాఖ రైల్వే జోన్ కోసం తాను పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కానీ చంద్రబాబు, జగన్లు తనతో కలిసి ఉమ్మడి పోరాటానికి సిద్ధంగా ఉన్నారా, తనతో కలిసి పోరాటం చేయగలరా అని ప్రశ్నించారు. ఇప్పటికే 6గురు వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని, మిగతా టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని, అప్పుడు మీతో పాటు నేనూ వస్తానని, రైల్ రోకో చేద్దామని పిలుపునిచ్చారు.

మురళీ మోహన్, అవంతిలకు హేళనగా ఉందా?
టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్, మురళీ మోహన్లకు రైల్వే జోన్, ప్రత్యేక హోదా అంటే హేళన అయిపోయిందని పవన్ కళ్యాణ్ ఏకిపారేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూదోపిడీలే అన్నారు. జ్యూట్ మిల్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తారని గంటా శ్రీనివాసరావును గెలిపించారని, కానీ పరిష్కారం కాలేదన్నారు. కాలుష్యంతో 24 జాతుల మత్స్య సంపద నాశనం అవుతోందన్నారు.

ఆవేశంగా పవన్ కళ్యాణ్
తెలుగుదేశం పార్టీ నేతల భూదోపిడీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుకోలేకపోతున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. తగరపువలస జనసేన పోరాట యాత్రలో పవన్ ఆవేశంగా మాట్లాడారు. ఉత్తరాంధ్ర చాలా వెనుకబడిందన్నారు. ఈ రోజు వరకు ఉత్తరాంధ్రలో పరిశ్రమలు లేవన్నారు. యువతకు ఉద్యోగాలు రాలేదన్నారు.

మోడీని ఢీకొట్టింది నేనే
డ్రెడ్జింగ్ కార్పోరేషన్ (డీసీఐ)పై చంద్రబాబు స్పందించలేదని, మొదట పోరాడింది జనసేననే అన్నారు. తాను రంగంలోకి దిగాకే చంద్రబాబు స్పందించారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారి ఢీకొట్టింది పవన్ కళ్యాణే అన్నారు. అలాంటి తనకు బీజేపీతో లంకె పెట్టడం విడ్డూరమన్నారు.

మోడీ అంటే బాబుకు భయం
ప్రత్యేక హోదా నుంచి డీసీఐ వరకు కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడింది జనసేన అన్నారు. ప్రధాని మోడీ అంటే చంద్రబాబుకే భయమని నిప్పులు చెరిగారు. కానీ నేను మోడీపై ధైర్యంగా మాట్లాడగలిగానని గుర్తు చేశారు. ఏపీ ప్రయోజనాలపై రాజకీయాలు పక్కన పెట్టి పోరాడేందుకు తాను సిద్ధమని, ఇతర పార్టీలు సిద్ధమా అని జనసేన నిలదీస్తోంది.












Click it and Unblock the Notifications