రాజమండ్రి మెడికో ప్రియాంక కేసులో మరో ట్విస్ట్..! తండ్రి కీలక నిర్ణయం..!
రాజమండ్రిలో ఈ నెల 3న ఆదిత్య మాల్ వద్ద ఫ్రెండ్ తో కలిసి సినిమాకు వెళ్తున్న వైద్య విద్యార్ధిని ప్రియాంక (Rajahmundry Medico Priyanka )ను కారుతో మూడుసార్లు ఢీకొట్టి, ఆమె తలపై నుంచి కారు పోనిచ్చిన ఘటనలో ఆమె సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. మరోవైపు ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రియాంకపై కారు నడిపి ఆమె బ్రెయిన్ డెడ్ కావడానికి కారణమైన నిందితుల్ని ఇప్పటివరకూ అరెస్టు చేయకపోవడం, వారిపై సాధారణ సెక్షన్లతో కేసు నమోదు చేయడంపై ఆమె కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక తండ్రి వెంకటేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 3న రాజమండ్రిలో ఈ ఘటన జరిగినా పోలీసులు అదే రోజు కేసు నమోదు చేసి, నిందితుల్ని అరెస్టు చేసే అవకాశం ఉన్నా నిర్లక్ష్యంగా ఉండిపోయారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి కారణం ప్రియాంకపై కారు నడిపిన ఇద్దరు నిందితులు సూరావరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ ఇద్దరూ స్థానికంగా పరపతి ఉన్న వారు కావడమే అనే ప్రచారం జరుగుతోంది. దీంతో పోలీసులు ఈ కేసులో నమోదు చేసిన సెక్షన్లు కూడా చర్చనీయాంశమయ్యాయి. తొలుత వీరిపై సాధారణ సెక్షన్లు పెట్టిన పోలీసులు.. అనంతరం ఆమె బ్రెయిన్ డెడ్ అయ్యాక వాటిని మార్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో ఆమె తండ్రి మరో కేసు నమోదు కోసం ఫిర్యాదు చేశారు.

నిందితులకు కఠిన శిక్షలు పడేలా సెక్షన్లు మార్చాలని, తన కుమార్తెకు ఈ గతి పట్టించిన వారికి చట్టప్రకారం తగిన శిక్షలు పడాల్సిందేనని తండ్రి వెంకటేష్ కోరుతున్నారు. దీంతో ఆయనతో జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్న ప్రియాంక ఆరోగ్య పరిస్ధితి ఏమాత్రం కుదుటపడటం లేదు. దీంతో ఆమెకు అప్నియా అందించేందుకు కూడా వైద్యులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. పరిస్ధితి సహకరించకపోతే మాత్రం ప్రియాంకను పూర్తి బ్రెయిన్ డెడ్ గా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.




Click it and Unblock the Notifications