యోగీ ఆదిత్యనాథ్ కి ముస్లిం వీరాభిమాని..! గుండెలపై పచ్చబొట్టుతో మనసులో కోరిక..!
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) స్వతహాగా ఓ సాధువు. సీఎం కాకముందు గోరఖ్ పూర్ ఆలయంలో పూజలు చేస్తూ కనిపించిన యోగీ.. ఆ తర్వాత మాత్రం రాజకీయాల్లో బిజీ అయిపోయారు. అయితే ఆయనపై ఉన్న హిందూ ముద్ర, అధికారంలోకి వచ్చాక కాషాయ దుస్తులతో కనిపిస్తూ, ముస్లింలపై ఉక్కుపాదం మోపుతున్నారని విమర్శలు ఎదుర్కొనే ఆయనకు ఓ ముస్లిం అభిమాని ఉన్నాడంటే నమ్మగలరా ? అవును ఇదే నిజం. అంతే కాదు ఆయన అలాంటి ఇలాంటి అభిమాని కాదు వీరాభిమాని కూడా.
యూపీలోని బిజ్నోర్కు చెందిన ముస్లిం న్యాయవాది తాబిష్ నిసార్ కు సీఎం యోగి ఆదిత్యనాథ్ అంటే వీరాభిమానం. నిసార్ తన అభిమాన నేత యోగీపై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ తాజాగా ఛాతీపై శాశ్వత పచ్చబొట్టు వేయించుకున్నారు. తన ఛాతీపై "నెక్స్ట్ పిఎం, సిఎం సాహెబ్ మహారాజ్ జీ యోగి జీ బీజేపీ" అనే పదాలను పచ్చబొట్టుగా వేయించుకున్నారు. అయితే ఇది కేవలం ప్రచారం కోసం కాకుండా.. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్న పనిని మెచ్చుకోవడానికే ఇలా పచ్చబొట్టు వేయించుకున్నానని చెప్పారు.

యూపీలో శాంతిభద్రతలను బలోపేతం చేశారంటూ యోగీ ఆదిత్యనాథ్ పై నిసార్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే యోగీ హయాంలో ప్రభుత్వ పథకాలు ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలకు చేరుతున్నాయని కూడా చెప్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ పనితీరు, పాలన ప్రాధాన్యతలు, ముఖ్యంగా శాంతిభద్రతల విషయంలో తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని నిసార్ అన్నారు. నేరాల పట్ల ప్రభుత్వ వైఖరిని నిసార్ ప్రశంసించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో కర్ఫ్యూలు లేవని గుర్తుచేశారు. సంక్షేమ పథకాలు వివక్ష లేకుండా అమలు చేస్తున్నారని, మహిళలు, బాలికల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించిందంటూ ప్రశంసిస్తున్నారు.














Click it and Unblock the Notifications
