అయోధ్య రామాలయంలో విరాళాల గోల్ మాల్ ? యోగీ సర్కార్ సంచలన నిర్ణయం..!
అయోధ్య శ్రీరామ మందిరానికి (Ayodhya ram Mandir) భక్తులు సమర్పించిన విరాళాలలో భారీగా ఆర్థిక అక్రమాలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారికంగా చేసిన విజ్ఞప్తి మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
అయోధ్య విరాళాలపై యోగీ
ఈ సున్నితమైన అంశంపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్, దర్యాప్తు పూర్తయ్యే వరకు రాజకీయ పార్టీలు, రామభక్తులు నిరాధారమైన వ్యాఖ్యలు చేయవద్దని కోరారు. రామమందిరం నిర్మాణం కోసం దాదాపు 500 ఏళ్ల పాటు సుదీర్ఘంగా వేచి చూసిన భక్తులు, నిజానిజాలు బయటకు రావడానికి మరో 15 రోజులు ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని భరోసా ఇచ్చారు.

దర్యాప్తు కోసం త్రిసభ్య కమిటీ
ఈ వివాదంపై సత్యాలను నిగ్గుతేల్చేందుకు ప్రభుత్వం ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన ఎస్ఐటీని రంగంలోకి దించింది. ఈ కమిటీలో లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ (IAS), ఐజీ కిరణ్ ఎస్ (IPS), ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ సభ్యులుగా ఉన్నారు. దర్యాప్తును వేగవంతం చేసి, ప్రాథమిక మరియు తుది నివేదికలను వీలైనంత త్వరగా సమర్పించాలని ప్రభుత్వం వీరిని ఆదేశించింది. విచారణలో దోషులుగా తేలిన వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం హెచ్చరించారు.
బయటపడిందిలా
అయోధ్య మాజీ ఎమ్మెల్యే, సమాజ్వాదీ పార్టీ నాయకుడు పవన్ పాండే ఈ ఆలయ విరాళాల అంశాన్ని మొదటిసారిగా తెరపైకి తెచ్చారు. ఆలయానికి సమర్పించిన విరాళాలలో సుమారు రూ. 7 కోట్ల నుంచి రూ. 7.5 కోట్ల వరకు అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సైతం స్పందిస్తూ నిష్పక్షపాత విచారణతో పాటు ఆలయ సీసీటీవీ దృశ్యాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ సైతం బీజేపీ వైఖరిని తప్పుపట్టారు.

ఆరోపణలు తోసిపుచ్చిన ట్రస్ట్
అయితే ప్రతిపక్షాల ఆరోపణలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పూర్తిగా త్రోసిపుచ్చింది. ఆలయానికి సంబంధించిన ప్రతి లావాదేవీ అధికారికంగా, అత్యంత పారదర్శకంగా సాగుతున్నట్లు ట్రస్ట్ ప్రతినిధి మహంత్ దినేంద్ర దాస్ మహారాజ్ స్పష్టం చేశారు. ఎవరి వద్దనైనా ఆధారాలు ఉంటే వాటిని ఎస్ఐటీకి సమర్పించవచ్చని సీఎం యోగి పేర్కొన్నారు. నిరాధారమైన ప్రచారాలతో పవిత్ర అయోధ్య ధామ్ ప్రతిష్టను దెబ్బతీయవద్దని ఆయన హితవు పలికారు.















Click it and Unblock the Notifications