ఇంద్రకీలాద్రిపై సామాన్య భక్తులకూ అంతరాలయ దర్శనం, ఈ రోజుల్లో..!!
దసరా ఉత్సవాలకు ఇంద్రీకీలాద్రి ముస్తాబు అవుతోంది. నవరాత్రుల కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో రవాణా.. ప్రసాదం.. క్యూ లైన్ల నిర్వహణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. ఇప్పటికే అధికారులు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సారి దసరా వేళ సామాన్య భక్తులకు సైతం అంతరాలయ దర్శనం కల్పించాలని ఆలయ పాలక వర్గం నిర్ణయించింది.
దసరా ఉత్సవాల కోసం ఇంద్రకీలాద్రి పై కార్యాచరణ సిద్దం అవుతోంది. ఆలయ పాలక మండలి సమావేశంలో 25 కీలక అంశాల పై చర్చ జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పాలకమండలి చైర్మన్ బొర్రా గాంధీ వెల్లడించారు. దసరా సందర్భంగా గతంలో చర్చ జరిగిన అంశాలపై ఈరోజు కూడా చర్చించినట్లు తెలిపారు. గతంలో కంటే ఈసారి మరింత ఘనంగా దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అమ్మవారి ఆలయం తరఫున కాణిపాకం వినాయకుడికి పట్టువస్త్రాలు సమర్పించినట్లు తెలిపారు. దసరా ఉత్సవాలకు సంబంధించిన పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లకు గత అనుభవం ఉందా? లేదా? అనేది పరిశీలించిన తర్వాతే కాంట్రాక్ట్ ఇస్తామని వెల్లడించారు. కాగా, గత దసరాకి పాలకమండలి లేదని.. కానీ ఈసారి దసరా ఏర్పాట్ల పరిశీలన కోసం పాలకమండలి సభ్యులను నియమించనున్నట్లు తెలిపారు.

అంతరాలయ దర్శనం
భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా.. ప్రతీ అంశం పైనా అవసరమైన నిర్ణయాలు తీసుకుంటా మని వివరించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఉండే విధంగా నిర్ణయాలు ఉంటాయని హామీ ఇచ్చారు. అదే విధంగా విద్యుత్, క్యూ లైన్లు, పెయింటింగ్ ప్రతిదీ పరిశీలిస్తామన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీఠ వేస్తామన్నారు. ఈసారి పోలీసులు తక్కువగా ఉండే విధంగా చూస్తామని తెలిపారు. ఈఏడాది ఆర్జిత సేవలను కొత్తగా నిర్మాణం చేసుకున్న భవనంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆర్జిత సేవల విషయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఇక.. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూస్తామని ఈవో శీనానాయక్ అన్నారు. సామాన్య భక్తులకు కూడా అంతరాలయ దర్శనం ఉండబోతుందని.. టికెట్ ఎంత అనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు ఈవో శీనా నాయక్ వెల్లడించారు.













Click it and Unblock the Notifications
