పవన్ కళ్యాణ్ ఆందోళన - ప్రభుత్వానిదే బాధ్యత..!!
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం పై జనసేనాని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానవీయంగా ఉందన్నారు. చంద్రబాబు ఆరోగ్యం పైన నిర్లక్ష్యం తగదన్నారు. ఆయన వయసును దృష్టిలో ఉంచుకోవడంతోపాటు, చంద్రబాబు ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన సమస్యలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. ఈ అంశంలోనూ రాజకీయ కక్ష సాధింపు ధోరణి సరికాదన్నారు.
చంద్రబాబు ఆరోగ్యం పైన కొద్ది రోజులుగా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని పైన జైలు అధికారులు స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు ఆరోగ్యం, భద్రత పైన ఎటువంటి సందేహాలు అవసరం లేదని..పూర్తి బాధ్యత తమదేనని స్పష్టం చేసారు. చంద్రబాబుకు స్కిల్ అలర్జీ కారణంగా దద్దుర్లు వచ్చాయని..డీ హైడ్రేషన్ కు గురయ్యారని అధికారులు వివరణ ఇచ్చారు. వైద్యులు చేసిన సూచనల మేరకు లోషన్లు అందించామని చెప్పుకొచ్చారు. తాజాగా చంద్రబాబు తరపు న్యాయవాదులు చంద్రబాబుకు జైలులో ఏసీ ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వాలని ఏసీబీ కోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం ఏసీ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చింది.

ఇక, తాజాగా చంద్రబాబు ఆరోగ్యం పైన జనసేనాని స్పందించారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబు ఆరోగ్య స్థితిగతుల విషయంలో నిర్లక్ష్యం తగదని అన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా ఆందోళన చెందితే.. ప్రభుత్వ సలహాదారులు, జైళ్ల శాఖ అధికారులు చేసిన వ్యాఖ్యలు- ప్రభుత్వ వైఖరిని సూచిస్తున్నాయని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. వైద్యుల నివేదికలను పట్టించుకోకపోవడం, చంద్రబాబు విషయంలో ప్రభుత్వ వైఖరిపై న్యాయస్థానం జోక్యం చేసుకొని విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆయన ఆరోగ్యం విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.












Click it and Unblock the Notifications