హంతకుడైన ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయరెందుకు- పవన్ కళ్యాణ్; జగన్ తోపాటు విజయమ్మనూ వదిలిపెట్టని అనిత!!
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు తన వద్ద పనిచేసే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇరుక్కున్నారు. కాకినాడలో ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో కుటుంబ సభ్యులు అనుమానించినట్టే ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు డ్రైవర్ ను హతమార్చి కట్టుకథ చెప్పారు. రోడ్డు ప్రమాదంలో మరణించాడని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అనుమానంతో కుటుంబసభ్యులు అడ్డుకోగా అక్కడి నుండి పలాయనం చిత్తగించాడు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన అనంత ఉదయ్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఎట్టకేలకు తానే డ్రైవర్ సుబ్రహ్మణ్యం ను హతమార్చానని ఎమ్మెల్సీ ఒప్పుకున్నాడు. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. హంతకుడైన ఎమ్మెల్సీ ని మంత్రులు వెనకేసుకొచ్చారు అంటూ మండిపడుతున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే అలాంటివారిని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్సీని ఈపాటికే పార్టీ నుంచి, పెద్దల సభ నుంచి బర్తరఫ్ చెయ్యాల్సింది: పవన్ కళ్యాణ్
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసినట్లుగా ఒప్పుకున్నప్పటికీ పోలీసులు అతని పట్ల గౌరవ మర్యాదలు కనబరిచిన తీరు విస్మయాన్ని కలిగించిందని పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. నేరస్తులకు వత్తాసు పలికేలా అధికార యంత్రాంగాన్ని పాలకులు వినియోగించుకుంటే శాంతిభద్రతల ఆలోచన కూడా చేయలేమని ఆయన పేర్కొన్నారు. వైసిపి పాలకులకు చిత్తశుద్ధి ఉంటే హత్య చేశానని ఒప్పుకున్న ఎమ్మెల్సీని ఈపాటికే పార్టీ నుంచి, పెద్దల సభ నుంచి పంపించివేసేలా చర్యలు తీసుకునేవారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
కోడికత్తి కేసు, వివేకానంద హత్యకేసుపై ప్రశ్నించిన పవన్ కళ్యాణ్
పోలీసులు రాజకీయ బాసుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా శాంతిభద్రతల పరిరక్షణలో స్వతంత్రంగా వ్యవహరించాలన్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు జరిగినా, దాడులు జరిగినా ఏం జరగదు అన్న ధైర్యం నేరస్థులకు కలగడానికి పాలకుల వైఖరే కారణమని మండిపడ్డారు.కోడి కత్తి కేసు లో ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నమ్మకం లేదు అన్న వారే ఇప్పుడు ఆ శాఖకు దిశానిర్దేశం చేస్తున్నారని, కోడి కత్తి కేసు పురోగతి ఏమిటో తెలియదు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో పులివెందుల వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం గుండెపోటు నుంచి ఇప్పటివరకు వెళ్లిందని ఇప్పటికీ సాగుతున్నా విచారణలో అసలు దోషులెవరో తేలలేదని పేర్కొన్నారు.
దళిత బిడ్డను పాశవికంగా చంపిన ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాలంటూ అనిత డిమాండ్
తాజాగా టిడిపి తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత దళిత బిడ్డను పాశవికంగా హింసించి చంపిన ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. నిన్నటి వరకూ బొత్స లాంటి మంత్రులు హంతకుడైన ఎమ్మెల్సీ ని వెనకేసుకొచ్చారని వంగలపూడి అనిత మండిపడ్డారు. సీన్ రివర్స్ అవ్వడంతో నేడు అంబటి, రోజా రంగంలోకి దిగారు. దోషులు ఏ పార్టీకి చెందిన వారైనా కఠినంగా శిక్షిస్తారు అంటూ చెప్పుకొస్తున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి నిజంగా న్యాయం వైపే ఉంటే హంతకుణ్ణి బర్తరఫ్ చేయించరెందుకు? అని వంగలపూడి అనిత ప్రశ్నించారు. దళితబిడ్డను పాశవికంగా హింసించి చంపిన ఎమ్మెల్సీ ని బర్తరఫ్ చేయాలని మండలి ఛైర్మన్ గారికి విన్నపం అంటూ వంగలపూడి అనిత పేర్కొన్నారు.
ఇలాంటి పార్టీకి మీరు ఇంకా గౌరవ అధ్యక్షురాలిగా ఎలా కొనసాగుతున్నారు విజయమ్మ గారు?
అంతేకాదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో విలువలు లేవు అంటూ అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో దొంగలకు, హంతకులకు, మహిళతో అసభ్యంగా ప్రవర్తించే వారికి స్థానం కల్పించారు అంటూ మండిపడ్డారు. స్త్రీ లోలురకు మంత్రి పదవులు ఇచ్చి సత్కరించే విలువలు, వంకాయల పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. హంతకుణ్ణి అని ఒప్పుకున్న ఎమ్మెల్సీని ఇంకా సస్పెండ్ చేయలేదు కదూ? అంటూ ఎద్దేవా చేశారు. బెయిల్ మీద బయటకురా, నీకూ ఓ మంత్రి పదవి ఇచ్చేద్దాం అన్న భరోసా ఇచ్చారేమో? అంటూ వంగలపూడి అనిత సెటైర్లు వేశారు. ఇలాంటి పార్టీకి మీరు ఇంకా గౌరవ అధ్యక్షురాలిగా ఎలా కొనసాగుతున్నారు విజయమ్మ గారు? అంటూ విజయమ్మ ను కూడా టార్గెట్ చేశారు వంగలపూడి అనిత.