వైసీపీ రాజకీయ తీరంలో ఎగసిపడుతున్న 'జనసేన' అలలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటివరకు పొత్తులపై స్పష్టత రాలేదు. కానీ అందరి దృష్టి జనసేనపైనే ఉంది. కింగ్ అవకపోయినా కింగ్మేకర్గా ఉండాలనే ఆకాంక్షను పవన్ వ్యక్తపరుస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలురైతులకు తన సొంత నగదును నష్టపరిహారంగా అందజేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్త్రతంగా పర్యటిస్తున్నారు. అక్టోబరు 5వ తేదీన నుంచి బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఏ సమావేశంలోనైనా ఆయన అధికార వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

కాపు సామాజికవర్గ ఎమ్మెల్యేల్లో గుబులు
పవన్ కల్యాణ్ దూకుడు రాజకీయం తెలుగుదేశం, వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేల్లో గుబులు రేకెత్తిస్తోంది. పవన్ కల్యాణ్ బరిలో ఉన్నప్పటికీ 2019 ఎన్నికల్లో కాపు సామాజికవర్గానికి చెందినవారు ఎక్కువ శాతం వైసీపీవైపు మొగ్గుచూపారు. ఆ ఎన్నికల్లో మొత్తం 30 మంది కాపు సామాజికవర్గ ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. ఎక్కువ సంఖ్యలో ఓట్లు వైసీపీకే పడ్డాయి. ఈ 30 మందిలో గంటా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడు, నిమ్మకాయల చినరాజప్ప తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికవగా, మిగతా 27 మంది వైసీపీ తరఫున ఎన్నికయ్యారు. ప్రభుత్వం కూడా వారికి ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి గౌరవించింది.

ప్రత్యేక వ్యూహాన్ని అవలంబించే దిశగా వైసీపీ ఎమ్మెల్యేలు
బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే విజయం కోసం తాము ఎటువంటి వ్యూహాన్ని అవలంబించాలనే యోచనలో వైసీపీ ఎమ్మెల్యేలున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో అధికార పార్టీకి నష్టం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాపు సామాజికవర్గ ఓటర్లను పవన్ కొన్నాళ్లుగా ఏకీకృతం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తాను ఒంటరిగా నిలబడినప్పటికీ కనీసం ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కాపుల ప్రాబల్యం ఉన్న ఇతర నియోజకవర్గాల్లో గుంపగుత్తగా కాపులు జనసేనకు ఓటేసేలా ఆయన ప్రణాళికలు రచించుకుంటున్నారు.

బీసీ ఓటుబ్యాంకును పటిష్ఠపరుచుకోవాలని..
కాపు సామాజికవర్గ ఓట్లు చేజారిపోతే ఆ లోటును బీసీ ఓటుబ్యాంకు ద్వారా ముఖ్యమంత్రి జగన్ పూడ్చుకోవాలనుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగా పథకాలను ప్రకటిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీల ఓటుబ్యాంకే కీలకంగా మారబోతోందని జగన్ భావన. అందుకు తగ్గట్లుగా ఆయన వ్యూహరచన చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి బీసీల ఓటుబ్యాంకును చీలుస్తున్నారనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో జనసేన ప్రభావం వల్ల కాపు ఓట్లకు గండిపడుతుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications