జనసేన అభ్యర్దుల పై పవన్ తాజా నిర్ణయం - కలిసొచ్చేనా..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. ఇప్పటికే సీఎం జగన్, చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. జనసేనాని పవన్ ప్రచారం ప్రారంభిస్తున్నారు. రేపు (శనివారం) పిఠాపురం నుంచి పవన్ వారాహి ద్వారా ప్రచారం మొదలు పెట్టనున్నారు. జనసేన పోటీ చేసే స్థానాల్లో ఇంకా ప్రకటించాల్సిన స్థానాల పైన పవన్ కసరత్తు చేస్తున్నారు. రెండు ఎంపీ స్థానాల్లో అభ్యర్దుల విషయంలో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పిఠాపురంలో పవన్
పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి ప్రారంభించే ఎన్నికల ప్రచారం 11 రోజుల పాటు 8 నియోజకవర్గాల్లో కొనసాగనుంది. తొలి విడతలో నాలుగు రోజుల పాటు పిఠాపురంలోనే బస చేయనున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొంటారు. వివిధ వర్గాలతో సమావేశం కానున్నారు. పార్టీ కేడర్ తోనూ మమేకం అవుతారు. ఏప్రిల్ 3న తెనాలిలో పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

పార్టీ నేత మనోహర్ తో కలిసి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఆ తరువాత ఉత్తరాంధ్రలో పవన్ పర్యటన నాలుగు రోజులు కొనసాగనుంది. ఏప్రిల్ 4న ఎలమంచిలి, 6న అనకాపల్లి, 7న పెందుర్తి నియోకవర్గాల్లో పవన్ కల్యాణ్ ఎన్నికల సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారైంది.
జనసేనాని ప్రచారం
ఏప్రిల్ 8న కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పవన్ పర్యటిస్తారు. ఏప్రిల్ 9న ఉగాది వేడుకలను పవన్ పిఠాపురంలోనే నిర్వహించనున్నారు. ఆ రోజు అక్కడే ఉండాలని నిర్ణయించారు. ఇక, జనసేన పోటీ చేయనున్న 21 అసెంబ్లీ స్థానాల్లో 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. పాలకొండ, అవనిగడ్డ అభ్యర్థులపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కసరత్తు సాగుతోంది.
పిఠాపురం పర్యటనకు ముందే వాటి అభ్యర్థులను ప్రకటించాలని భావించారు. కానీ ఆ రెండు స్థానాలకు పోటీపడుతున్న ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ప్రకటన కొంత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. పాలకొండకు ఆరుగురు పోటీ పడుతున్నారు. పార్టీలో కొంత మంది నాయకులు ఆ సీటు ఇప్పిస్తామని కొంత మందిని వెంట పెట్టుకుని పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
పెండిండ్ వాటి పై కసరత్తు
పాలకొండ లో వైసీపీ నుంచి విశ్వాసరాయి కళావతి పోటీ చేస్తున్నారు. జనసేన తరఫునా మహిళనే బరిలోకి దించే ఆలోచనలో జనసేన నాయకత్వం ఉంది. అవనిగడ్డ సీటు కోసం విక్కుర్తి శ్రీనివాస్, బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ పోటీ పడుతున్నారు. విక్కుర్తికే సీటు ఖాయమయ్యే అవకావం ఉందని తెలుస్తోంది. ఈ రెండు సీట్లకూ అభ్యర్థులపై పవన్ పిఠాపురం పర్యటన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మచిలీపట్నం లోక్సభ సీటు విషయంలో డైలమా కొనసాగుతోంది. వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన ఎంపీ వల్లభనేని బాలశౌరి ఇక్కడి నుంచి పోటీ చేసే అంశంపై సృష్టత ఇవ్వలేదు. ఆయన పోటీ నుంచి వైదొలిగితే గ్రీన్కో డైరెక్టర్ బండారు నరసింహారావు బరిలో నిలిచే అవకాశముంది. ఈ సీట్ల విషయంలో పవన్ నిర్ణయం ఏంటనేది పార్టీలో ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications