Pawan Kalyan: పిఠాపురంలో కొత్త ఇంట్లోకి పవన్- వర్మతో కలిసి ఉగాది వేడుకలు..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఉగాది వేడుకలు జరుపుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత వర్మ సహా ఇతర నేతలు హాజరయ్యారు. ముందుగా ఉగాది వేడుకల్లో పాల్గొని ఆశీస్సులు అందుకున్న పవన్.. అనంతరం తాజాగా తీసుకున్న కొత్త ఇంట్లోకి ప్రవేశించారు. ముందుగా అనుకున్న విధంగానే పవన్ ఉగాది వేళ కొత్త ఇంట్లో అడుగుపెట్టారు.
ఉగాది వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. పంచాంగ శ్రవణం అనంతరం కాసేపు మాట్లాడారు. రైతు క్షేమంగా ఉండాలి, యువతకు ఉపాధి అవకాశాలు రావాలి, మహిళలు నిర్భయంగా తిరగగలిగే ధైర్యం కావాలి, ఉద్యోగులకు సకాలంలో జీతాలు రావాలి, అందరూ ఆనందంగా ఉండాలని పవన్ ఆకాంక్షించారు. క్రోధినామ సంవత్సరంలో అందరికీ అన్ని శుభాలు కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

రెండేళ్ల క్రితమే స్ధానికంగా ఉంటున్న ఓడూరి నాగేశ్వరరావు కుటుంబం తనను పిఠాపురంలో పోటీ చేయాలని కోరిందన్నారు. అయితే అప్పట్లో ఆలోచించలేదన్నారు. ఆ తర్వాత తనను ఇంతమంది ఆహ్వానిస్తుంటే పోటీకి నిర్ణయం తీసుకున్నామన్నారు. క్రోధినామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. విజయకేతనం ఎగురవేస్తున్నామని, అది పిఠాపురం నుంచే మొదలుపెడుతున్నట్లు తెలిపారు. దీంతో కార్యకర్తలు హర్షధ్వానాలు చేశారు.













Click it and Unblock the Notifications