బీజేపీ నేత, మహారాష్ట్ర సీఎంతో పవన్ కళ్యాణ్ సంబరాలు
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సంక్రాంతిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులతో కలిసి జరుపుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెళ్లారు. స్వర్ణభారతి ట్రస్ట్ కార్యక్రమంలో జరుగుతున్న ఈ వేడుకలకు పవన్ రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
వెంకయ్య జరిపే సంక్రాంతి వేడుకల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరయ్యారు. దీంతో పవన్, వెంకయ్య, ఫడ్నవీస్లు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ - టీడీపీ కూటమికి పవన్ ప్రచారం చేసినప్పటి నుండి ఆయనకు బీజేపీ మంచి ప్రాధాన్యత ఇస్తోంది.
కాగా, పవన్ కళ్యాణ్కు భారతీయ జనతా పార్టీ ఇచ్చే ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ - టీడీపీ కూటమికి ఆయన జోరుగా ప్రచారం చేశారు. పవన్ సేవలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా గుర్తు పెట్టుకున్నారు. తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బీజేపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్కు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్నికల అనంతరం ఆయనను చాలామంది నేతలు కలిశారు. ఏపీలో పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్తేనే బాగుంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్కు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నుండి పిలుపు వచ్చింది.
సంక్రాంతి పండుగ సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేయాలని కోరారు. వెంకయ్య తన సొంత జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటాపురంలో సంక్రాంతి సంబరాలు జరుపుతున్నారు. దీనికిపవన్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. వెంకయ్య విజ్ఞప్తికి పవన్ కూడా సుముఖత వ్యక్తం చేశారు.