హైకోర్టు తీర్పుతో ఇరుకునపడ్డ పవన్ ? ఎల్లుండి టూర్ సస్పెన్స్ ! ముందునుయ్యి, వెనుక గొయ్యి !
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసే ప్రయత్నంలో ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఎంత దూకుడుగా వెళ్తున్నారంటే ఒక్కోసారి ఆయన వాస్తవ పరిస్ధితుల్ని కూడా అర్ధం చేసుకోకుండా విమర్శలు చేసేయడం, నిర్ణయాలు తీసుకోవడం చేస్తున్నారు. ఆ తర్వాత వాస్తవాలు తెలుసుకునే సరికి పుణ్యకాలం పూర్తయిపోతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ఓ పని ఇప్పుడు ఆయన్ను చిక్కుల్లోకి నెట్టేసింది. దీంతో దిద్దుబాటు చర్యల విషయంలో పవన్ తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ రాజకీయం
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలతో కలిసి పోరాటాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో కొందరి ట్రాప్ లో పడుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ అనుభవం తక్కువగా ఉండటం, క్షేత్రస్ధాయి పరిస్ధితులపై పూర్తిగా అవగాహన లేకపోవడంతో భావోద్వేగాలతో తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకు చేటు చేసేలా ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలోనే విశాఖ టూర్ ద్వారా పవన్ కళ్యాణ్ కు మైలేజ్ వచ్చినట్లు అంతా భావించినా.. ఆ తర్వాత చేసిన ఇప్పటం టూర్ మాత్రం ఆయన్ను చిక్కుల్లోకి నెట్టింది. దీంతో ఆయన ఇప్పుడు ఈ వివాదం నుంచి ఎలా బయటపడాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటంలో పవన్ హంగామా
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో గతంలో జనసేన ఆవిర్భావ సభ జరిగింది. ఈ సభకు అవసరమైన స్ధలాన్ని ఇప్పటం గ్రామస్ధులు ఇచ్చారు. దీనికి ప్రతిగా జనసేన సభలోనే ఇప్పటం అభివృద్ధికి పవన్ రూ.50 లక్షల సాయం ప్రకటించారు. ఆ తర్వాత దీన్ని సీఆర్డీయే ఖాతాలో వేయాలని, తామే అభివృద్ధి చేస్తామని అధికారులు గ్రామస్తులపై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు. దీనికి వారు ఒప్పుకోకపోవడంతో ఇప్పటం వంటి చిన్న గ్రామంలో 120 అడుగుల రోడ్డు వేస్తామంటూ ఇళ్ల కూల్చివేతలు మొదలుపెట్టారు. అయితే అధికారులు నోటీసులు ఇచ్చి ఈ తతంగం మొదలుపెట్టారు. కానీ ఇవేవీ తెలియని పవన్ నోటీసులు ఇవ్వకుండా ఇళ్ల కూల్చివేతల్ని చేపట్టారంటూ ఇప్పటంలో నానా హంగామా చేశారు. కూల్చివేసిన ఇళ్లకు లక్ష చొప్పున సాయం కూడా ప్రకటించారు.
హైకోర్టు జరిమానా షాక్
ఇప్పటం గ్రామస్దులకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చాకే కూల్చివేతలు చేపట్టారు. ఈ విషయాన్ని దాచి హైకోర్టులో నోటీసులు ఇవ్వకుండా తమ ఇళ్లు కూల్చివేస్తున్నారని 14 మంది గ్రామస్ధులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. స్పందించిన హైకోర్టు వెంటనే కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. అయితే చివరికి అధికారులు సదరు నోటీసుల్ని కోర్టులో సమర్పించారు. దీంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్లను హైకోర్టుకు పిలిపించి కోర్టును తప్పుదోవ పట్టించినందుకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున జరిమానా విధించింది. దీంతో ఇప్పటం గ్రామస్ధులతో పాటు వారిని సమర్ధించిన పవన్ కళ్యాణ్ కూడా ఇరుకునపడ్డారు. అంతకు ముందే గతంలో ప్రకటించిన లక్ష రూపాయాల సాయం అందించేందుకు ఈ నెల 27న ఇప్పటం వెళ్లాలని పవన్ నిర్ణయించారు.
పవన్ కు ముందునుయ్యి, వెనుక గొయ్యి ?
హైకోర్టు జరిమానా నేపథ్యంలో ఇప్పటం గ్రామస్ధులతో పాటు పవన్ కూ భారీ షాక్ తగిలినట్లయింది. అలాగే కూల్చివేసిన ఇళ్లకు సాయంగా లక్ష రూపాయల చొప్పున ఇస్తానని పవన్ గతంలో ప్రకటించారు. దీంతో ఆ సాయం అందించేందుకు పవన్ ఈ నెల 27న అంటే ఎల్లుండి ఇప్పటం రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు హైకోర్టు.. ఇప్పటం గ్రామస్ధులు తమను తప్పుదోవపట్టించారంటూ లక్ష జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో జరిమానా పడిన పిటిషనర్లకు లక్ష సాయం అందించడం నైతికంగా సరైనదేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ మొండిగా అక్కడికి వెళ్లి వారికి సాయం అందిస్తే విమర్శలు తప్పవు. అలాగని మొహం చాటేస్తే పవన్ క్రెడిబిలిటీ మీద ప్రశ్నలూ తప్పవు. దీంతో ఈ నెల 27న పవన్ రాకపై సస్పెన్స్ నెలకొంటోంది.