జగన్ రెడ్డి! అప్పుడేమన్నారు? ఇప్పుడేం చేస్తున్నారు?: రైతుకు కులమా? అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం
అమరావతి: రైతు సమస్యలు తీర్చాలంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిసెంబర్ 12న కాకినాడలో ఒక రోజు దీక్ష చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దీక్షకు 'రైతు సౌభాగ్య దీక్ష' అని నామకరణం చేసింది జనసేన పార్టీ. ఇందుకు సంబంధించిన పోస్టర్ను పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు.

ఉభయ గోదావరి జిల్లాలపై పవన్ ఆందోళన..
‘మన ఆంధ్రప్రదేశ్ను దేశానికి అన్నపూర్ణగా మనమంతా చెప్పుకుంటాము. ముఖ్యంగా వరి పంటకు మన రాష్ట్రం ప్రసిద్ధి.. అందులోనూ ఉభయ గోదావరి జిల్లాలు ఈ పంటకు పేరెన్నికగన్నాయి. మన రాష్ట్రంలో సగటున 50 లక్షల క్వింటాళ్ల ధాన్యం ఏటా పండుతుండగా అందులో 25 లక్షల క్వింటాళ్లు ఉభయగోదావరి జిల్లాల్లోనే పండుతోంది. రానున్న రోజులలో ఈ పరిస్థితి కనుమరుగయ్యే దుస్థితి నెలకొంటోంది' అని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

రైతులు భయపడేలా ప్రభుత్వ విధానాలు
‘వరి పంట వేయడానికి రైతులు భయపడేలా ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయి... గిట్టుబాటు ధర లేక, ఖర్చులు సైతం రాబట్టుకోలేక వరి సాగు చేసిన రైతులు అప్పుల పాలవుతున్నారు. అనేకమంది ధాన్యం రైతులు నన్ను కలిసి వారి అవస్థల గురించి చెప్పారు' అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

అందుకే ఈ సంకల్పం...
‘రైతుల పరిస్థితి స్వయంగా తెలుసుకుందామని గత ఆదివారం మండపేట, పరిసర ప్రాంతాలలో పర్యటించాను. రైతులతో స్వయంగా మాట్లాడాను. వారు చెప్పిన మాటలు విన్న తరవాత మాటలలో చెప్పలేనంత బాధ అనిపించింది. వారి దుస్థితిని జగన్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి డిసెంబర్12వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలో ఒక రోజు నిరాహార దీక్ష చేయాలని సంకల్పించాను' అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

రైతు సౌభాగ్య దీక్షకు కారణమదే..
‘మండపేటలో జరిగిన రైతు సమావేశంలో మూడు రోజులలో రైతుల సొమ్ము వారి బ్యాంకు ఖాతాలలో వేయమని ప్రభుత్వాన్ని కోరాను. వారి సమస్యలను పరిష్కరించమని చెప్పాను. ప్రభుత్వంలో చలనం లేదు. 151 మంది బలం కలిగిన వైసిపి ప్రభుత్వం అంతే బలంగా పని చేయవలసి ఉండగా.. ధాన్యం రైతుల పట్ల కనీస స్పందన చూపలేదు. జగన్ రెడ్డి ప్రభుత్వానికి రైతుల సమస్యలను బలంగా తెలియచేయడానికే రైతు సౌభాగ్య దీక్ష తలపెట్టాను. గత రబీ సీజన్లోనే ధాన్యం రైతులు తమ దుస్థితిని నా దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరిస్తుందనుకున్నా.. అది భ్రమగా మిగిలిపోయింది' పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

బియ్యం గింజకు లేని కులం.. రైతుకు ఎందుకు?.. అప్పుడేమన్నారు?
‘గతంలో జగన్ రెడ్డి గారు తన పాదయాత్రలో.. పంట చేతికి రావడానికి నెల రోజుల ముందే కస్టం మిల్డ్ రైస్ (సిఎంఆర్.) ను ప్రకటించి, ధాన్యం ఇచ్చిన మూడు రోజులకే రైతుల ఖాతా లో డబ్బు వేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ధాన్యం తీసుకున్న 45 రోజుల తరువాత హడావిడిగా అర్ధరాత్రి వేళ సిఎంఆర్ ప్రకటించి ఇంతవరకు రైతుకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. దాంతో రబీ కోసం అయిదు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి వ్యవసాయ పనులు ప్రారంభించవలసి వచ్చిందని రైతులు చెబుతున్నారు. కౌలు రైతులకు రైతు భరోసా కల్పించడంలో కుల విచక్షణ ఎందుకని రైతులు అడుగుతున్న ప్రశ్నలను ఈ ప్రభుత్వం అర్ధం చేసుకోవలసి వుంది. బియ్యం గింజకు లేని కులం పంట పండించే రైతుకు ఎందుకని వారు అడుగుతున్న దానికి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పవలసిన అవసరం వుంది. కులాలకు అతీతంగా కౌలు రైతులు అందరికీ రైతు భరోసా పథకం వర్తింపచేయవలసి వుంది. ఎందుకంటే కౌలు రైతు ఖర్చులతో కుంగిపోతున్నాడు కనుక..' అని పవన్ కళ్యాణ్ అన్నారు.

అటువంటి రోజు కోసమే దీక్ష..
‘ఎకరాకు 35 వేల రూపాయలు ఖర్చులు అవుతుండగా ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరతో ఖర్చులు కుడా రాని పరిస్థితి నెలకొంది. కౌలు రైతులకు అదనంగా మరో 15 వేల రూపాయల కౌలు భారం మోయవలసి వుంది. దీనివల్ల 75 కిలోల బస్తాకు సగటున ఇప్పుడు ఇస్తున్న కనీస మద్దతు ధర 1361 ఉండగా అది 2000 రూపాయలు చేసినప్పుడే తమకు గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం రైతుకు కల్పించవలసి ఉందని స్వామినాథన్ రిపోర్ట్ ఒక పక్క చెబుతుండగా కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో రైతు కొట్టుమిట్టాడుతున్నాడు. మరి దీనిపై ఆలోచించే వారు ఎవరు? జగన్ రెడ్డి ఈ విషయం పట్టదా... నష్టాలపాలవుతున్నా సమాజంలో గౌరవం కోసం వ్యవసాయం చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. కడుపు మండి 2011లో ఒకసారి కోనసీమ రైతులు పంట విరామం ప్రకటించి నిరసన వ్యక్తం చేసారు. ఆనాడు దేశమంతా నివ్వెరపోయింది. అటువంటి ఆగ్రహాన్ని మనం రైతు నుంచి చూడకుండా ఉండాలంటే పాలకులు కళ్ళు తెరవాలి. వ్యవసాయాన్ని దండగలా కాకుండా పండుగలా చేయాలి. అటువంటి రోజు కోసమే 12 న దీక్ష తలపెట్టాము. ప్రతీ జనసైనికుడు రైతుకు సంఘీభావం తెలపాలి. వారి కన్నీటిని తుడవడానికి ప్రయత్నించాలి' అని జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications