పవన్కళ్యాణ్ ఫస్ట్ రియాక్షన్: 2019లో ఓడినప్పుడు నా పరిస్థితి ఎలాఉందో ఇప్పుడూ అలాగే ఉంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ తొలిసారి స్పందించారు. ఏపీలో టిడిపి జనసేన బీజేపీ కూటమి విజయం సాధించడం పైన మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇది ఎంతో చారిత్రాత్మకమైన రోజు అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల కోసం తాము పని చేస్తామన్నారు. ఏపీలో చీకటి రోజులు ముగిశాయన్న పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించామని వైసిపిని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టేది లేదన్నారు.
ఎన్నికల్లో విజయంతో తమపైన బాధ్యత పెరిగింది
ఏపీ భవిష్యత్తుకు బలమైన పునాది వేసే సమయం వచ్చిందన్న ఆయన, రాష్ట్రంలో అన్నం పెట్టే రైతులకు అండగా ఉంటామన్నారు. ఏపీలో రక్షణలేని ఆడబిడ్డలకు రక్షణ కల్పించే సమయమని, ఏపీ ప్రజలకు ఇచ్చిన మాటను తప్పనిసరిగా నిలబెట్టుకుంటా అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయంతో తమపైన బాధ్యతను మరింత పెంచారని, ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని తను భావిస్తున్నట్లుగా వెల్లడించారు.

బాధ్యతగా పని చేస్తాం
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బలమైన పునాదులు వేసే సమయం వచ్చిందని, తాము ఏరు దాటాక తెప్ప తగలేసే రకం కాదని చెప్పారు.
ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు గుర్తున్నాయి అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాము పోటీ చేసి గెలిచింది 21 సీట్లే అయినా 175 సీట్లలో ఎంత బాధ్యత ఉంటుందో అంతే బాధ్యతగా పనిచేస్తామని చెప్పారు.
రాజకీయాలలోకి వచ్చింది అందుకే
సగటు మనిషి కష్టం చూసి తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్, డబ్బు, పేరు కోసం తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు.2019లో పోటీ చేసి రెండు చోట్ల ఓడినప్పుడు నా పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రస్తుతం కూడా అదే పరిస్థితిలో ఉన్నానన్నారు. గెలుపోటములను సమానంగా తీసుకుంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆకాశమంత విజయాన్ని ఇచ్చిన పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను అన్నారు.
నూటికి నూరు శాతం సీట్లలో గెలిచిన పార్టీ జనసేన మాత్రమే
పిఠాపురంలో తనకు సహకరించిన తెలుగుదేశం పార్టీ నేత వర్మకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురం ప్రజలు పవన్ ను కాదు గెలిపించింది, రాష్ట్రంలోని ప్రజలను అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే బాధ్యత తీసుకుంటామని, రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షిస్తామని, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. నూటికి నూరు శాతం సీట్లలో గెలిచిన పార్టీ జనసేన మాత్రమేనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జనసేన ను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications