రాయలసీమను రతనాల సీమగా మార్చేలా..రూ.8వేల కోట్లతో పవన్ కళ్యాణ్ విజన్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారిస్తోంది. రతనాల సీమగా రాయలసీమను మార్చాలని సంకల్పించింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏపీలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రాయలసీమ అభివృద్ధికి భారీ బడ్జెట్ ను కేటాయించి రంగంలోకి దిగారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ రాయలసీమ అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా సుమారు రూ.8,022 కోట్ల విలువైన భారీ గ్రామీణాభివృద్ధి పనులు చేపడుతున్నారు. దీని కారణంగా రాయలసీమ ఆర్థిక అభివృద్ధికి ఊతం ఇస్తున్నామని ఆయన తెలిపారు.

రాయలసీమ గ్రామాలకు రవాణా సదుపాయాల మెరుగుదల
ఈ మొత్తంలో రూ.4,523 కోట్లు 23 వేలకు పైగా రోడ్డు పనులకు కేటాయించారు. బీటీ, సీసీ రోడ్లతో కలిపి 5,238 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించారు, మరమ్మతు చేశారు. గ్రామాలకు రవాణా సదుపాయాలను మెరుగుపరిచారు. వికసిత్ భారత్ - గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ కింద 62 వేల ఎకరాల్లో హార్టికల్చర్కు మద్దతు ఇచ్చారు. దీనివల్ల 28 వేల మంది రైతులు లబ్ధి పొందారు.
ఫార్మ్ పాండ్స్, హార్టికల్చర్ పంటలకు ఖర్చు
ఫార్మ్ పాండ్స్ నిర్మాణం ద్వారా రాయలసీమలో అదనంగా 50 వేల ఎకరాలు సాగులోకి వచ్చాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 41,614 ఫార్మ్ పాండ్స్ను రూ.167 కోట్లతో నిర్మించారు. తదుపరి దశలో మరో 29,902 పాండ్స్కు అనుమతి ఇచ్చారు. హార్టికల్చర్ పంటలకు రెండు దశల్లో రూ.200కోట్లకు పైగా ఖర్చు చేశారు.
గ్రామాల అభివృద్ధి, అటవీ అభివృద్ధి పనులు
జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకాల కింద మూడు మెగా తాగునీటి పథకాలు కూడా అమలవుతున్నాయి. గ్రామాల అభివృద్ధి, అటవీ అభివృద్ధి పనులు కూడా చేపట్టారు. ఈ చర్యల వల్ల రాయలసీమలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు.














Click it and Unblock the Notifications