అలా చేస్తే జనసేనకు 40సీట్లు వచ్చేవి; సీఎం జగన్ పైనా పవన్ కళ్యాణ్ ఘాటువ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి లోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి జనసేన పార్టీ కర్తవ్యాన్ని పార్టీ శ్రేణులకు వెల్లడించారు.

కులమతాలకు అతీతంగా రాజకీయాలు చెయ్యటం కోసమే జనసేన
ఎందరో యోగుల త్యాగ ఫలితంగా ఈరోజు మనం స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నాము అని చెప్పిన పవన్ కళ్యాణ్, స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో జనసేన పార్టీ స్థాపించబడింది అని గుర్తు చేశారు. కుల మతాల ప్రస్తావన లేని రాజకీయాలు దేశానికి కావాలని పేర్కొన్న పవన్ కళ్యాణ్, కుల,మతాలకు అతీతంగా రాజకీయాలు చేయడం కోసమే జనసేన పార్టీ ఏర్పాటు చేయబడింది అని వెల్లడించారు. ఎవరినైనా కలపడం కష్టమని, విడదీయడం సులభమని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ప్రజలను విభజించి పాలించడం మంచిదికాదని సూచించారు.ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం కావాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఓట్లు వస్తాయో లేదో తెలియదు కానీ తాను వాస్తవాలు మాత్రమే మాట్లాడతానని పేర్కొన్న పవన్ కళ్యాణ్ కుల మతాల ప్రస్తావన లేని రాజకీయం జనసేన పార్టీ లక్ష్యమని తేల్చిచెప్పారు

కుల రాజకీయాలు చేస్తే జనసేనకు 40 సీట్లు వచ్చేవి
కులం చూసి రాజకీయాలు చేసుంటే జనసేన పార్టీకి 40 సీట్లు వచ్చి ఉండేవని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పదవి కోరుకుంటే 2009లోనే ఎంపీ అయ్యేవాడిని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాను ఒక కులం కోసం రాజకీయాల్లోకి రాలేదని, వైఎస్ఆర్ సిపి నేతలు పద్ధతి మార్చుకోవాలని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. 151 సీట్లలో గెలిపించింది ప్రజలపై దాడి చేసేందుకేనా అని వైసీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ గుడివాడలో ఎమ్మెల్యే కనుసన్నల్లో ఇసుక దందా నడుస్తోందని, అక్రమ సంపాదనతో ఒక్కో ఎమ్మెల్యే కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. ప్రజలపై దాడులు చేయడానికి సీఎం అధికారాన్ని ఉపయోగిస్తున్నారు అంటూ మండిపడ్డారు.

బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్తారు
బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే లకు ప్రజలే బుద్ధి చెబుతారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక అధికారులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని, చొక్కా పట్టుకుని నిలదీసే విధానం కూడా ప్రజల్లో రావాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైయస్సార్సిపి నేతలు ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారో తనకు బాగా తెలుసని పేర్కొన్న పవన్ కళ్యాణ్ మభ్య పెట్టే రాజకీయాలపై ప్రజల్లో మార్పు రావాలని వ్యాఖ్యానించారు. కులాలు, మతాల కోసం పోరాటాలు మాని దేశం కోసం పోరాడాలన్నారు పవన్ కళ్యాణ్.
స్వార్ధంకోసం మత ప్రస్తావన తెచ్చేవారిని ఖండించాలి
వైజాగ్ లో పరిశ్రమల కాలుష్యం, ఆక్వా పరిశ్రమల వల్ల నీరు, భూమి కాలుష్యం అయిపోతున్న అంశాలను ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ కాలుష్యం బారినుండి నీటిని, భూమిని కాపాడటం జనసేన పార్టీ బాధ్యత అని గుర్తు చేశారు. ఒక మసీదులో లేదా ఒక చర్చిలో అపవిత్రం జరిగితే ఏ విధంగా బలంగా ఖండిస్తామో, అదేవిధంగా దేవాలయాలలో అపవిత్రం జరిగితే అంతే బలంగా ఖండిస్తామని, అదే సెక్యులరిజం అని పేర్కొన్నారు. రామతీర్థం ఘటనలో రాముడు శిరస్సును ధ్వంసం చేసిన ఘటనను ఖండించాం తప్ప ఎక్కడ రెచ్చగొట్టలేదని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. స్వార్థ ప్రయోజనాల కోసం మత ప్రస్తావన తీసుకు వచ్చే వారిని, తప్పులు చేసే వారిని జనసైనికులు, నేతలు ముక్తకంఠంతో ఖండించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

యువతకు ఉపాధికి ఒక్కొక్కరికి 10లక్షల సాయం ఇవ్వాలి
రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉద్యోగాల సమస్య గురించి మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి సంవత్సరం యువతకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు వారికి ఉపాధికి పెట్టుబడిగా ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. పాలకులు రాష్ట్రంలోని సమస్యలతో పాటుగా, ఇతర దేశాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను అర్థం చేసుకోగలిగితే, రాష్ట్రంపై భారం పడకుండా అనేక విషయాలలో ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అలా జాగ్రత్త తీసుకోకపోవటం వల్ల అనేక నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

జగన్ అధికారంలోకి వచ్చాక లా అండ్ ఆర్డర్ బలహీనం, దిశా యాప్ పేరుతో మోసం
లా అండ్ ఆర్డర్ బలంగా లేకపోతే సమాజం క్షీణిస్తుందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి, ఇప్పటివరకు లా అండ్ ఆర్డర్ ఏపీలో బలహీనంగా ఉందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తనపై జరిగిన కోడి కత్తి దాడి కేసును ఛేదించలేక పోయారని, దిశ యాప్ తీసుకువచ్చి మహిళలపై దాడులకు పాల్పడితే 14 రోజుల్లో శిక్ష విధిస్తామని చెప్పి, ఇప్పటి వరకు ఎలాంటి శిక్షలు అమలు చేయకుండా మభ్యపెడుతున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఏకరువు పెట్టిన పవన్ కళ్యాణ్, పాలకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.












Click it and Unblock the Notifications