ఆ వ్యూహం నాకు వదిలేయండి.. దెబ్బకొడితే..: పవన్ కళ్యాణ్ క్లారిటీగా ఉన్నారా?
అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీతో ఉన్నారా? పార్టీలో చేరే వారి నుంచి మొదలు.. జనసేన బలం, అసెంబ్లీలో అడుగు పెట్టే అంశం వరకు అన్ని విషయాల్లో పూర్తి స్పష్టతతో ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు జనసైనికులు. ఇదే విషయాన్ని పార్టీ అధినేత కూడా చెబుతున్నారని అంటున్నారు.
ఏపీ విభజన రాజ్యాంగ విరుద్ధం, మళ్లీ తెలుగు రాష్ట్రాలు కలుస్తాయని కాదు: పవన్ కళ్యాణ్, వైసీపీ డుమ్మా
జనసేనాని ఇటీవల ఆయా జిల్లాల్లో పార్టీ నాయకులు, జనసైనికులతో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. 2019 అసెంబ్లీ, లోకసభ ఎన్నికలపై ఎంత స్పష్టంగా ఉన్నాననే విషయాన్ని తెలియజేస్తున్నారు.
అసెంబ్లీలో అడుగు పెడతాం.. వ్యూహం నాకు తెలుసు
ఏపీ అసెంబ్లీలో జనసేన కచ్చితంగా అడుగు పెడుతుందని, అందుకు తగిన వ్యూహం తనకు తెలుసునని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. మన వద్ద వేల కోట్ల రూపాయలు లేవని, బలమైన వ్యూహంతో ఏపీ శాసన సభలో జనసేన అడుగు పెడుతుందని తెలిపారు. జనసేన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని చెప్పారు. అంతటి రాజకీయ వ్యూహం, ఎత్తుగడలు తనకు వదిలేయాలని, నేను రాష్ట్ర ప్రజలను, జన సైనికులను మోసం చేయనని చెబుతున్నారు.
పార్టీలో చేరేవారి గురించి బాగా తెలుసు కానీ..
తన పార్టీలో చేరే నేతల గురించి కూడా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ఉన్నారని అంటున్నారు. పార్టీలో చేరేవారి గురించి తనకు తెలుసునని, కానీ వారు జనసేనలో చేరిన తర్వాత అవినీతికి దూరంగా ఉండాలన్నదే తన కోరిక అని అభిప్రాయపడ్డారు. రాజకీయాలు అంటేనే బురద అని, ఆ బురదలో దిగి దానిని శుభ్రం చేయాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. పార్టీలో చేరే వారి గురించి చాలామంది చాలా చెప్పుకుంటారని, అలాంటి వారి గురించి నాకు తెలియదని భావిస్తారని, కానీ తనకు అందరి గురించి తెలుసునని, కానీ తన వద్దకు వచ్చాక పాత పార్టీలో దోచుకున్నట్లుగా దోచేస్తానంటే అంగీకరించేది లేదని తేల్చి చెబుతున్నారు. తన వద్దకు వచ్చిన వారు మారాలని అన్నారు. తాను గుడ్డిగా ఎవరినీ నమ్మనని స్పష్టం చేశారు.
రాజకీయాలు అంటే జనసేనాని ఉద్దేశ్యంలో
పాలిటిక్స్ అంటే చాలా ప్యూర్గా ఉండాలని అభిమానులకు, ఇతరులకు ఉంటుందేమోనని, కానీ ఆ ఆలోచన తనకు లేదని చెప్పారు. పాలిటిక్స్ నీచంగా ఉంటాయని, పక్కనే ఉండి పొడిచేస్తారని, కానీ పార్టీలోకి వచ్చాక వారు మారాలని చెప్పారు. సమాజానికి ఏదైనా చేయాలని ఉంటే, సమాజం పట్ల పిచ్చి ఉంటే రాజకీయాల్లోకి దిగి మార్చాలని చెప్పారు. అవకాశవాద రాజకీయాలను సంపూర్ణంగా ఆపలేకపోవచ్చునని, కానీ మనకు సాధ్యమైనంత నిలువరించాలని చెప్పారు. మొత్తానికి అవినీతిపరులు పార్టీలోకి వచ్చి నీతిమంతులు కావాలని కోరుకుంటానని చెప్పారు.
దెబ్బకొడితే మరింత బలం వస్తుంది
ఎవరు ఇదివరకు ఏ పార్టీలో ఉన్నా జనసేనలోకి వచ్చాక మాత్రం మన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని చెబుతున్నారు. ఎవరైనా వచ్చి పవన్ కళ్యాణ్ను వెన్నుపోటు పొడవవచ్చు.. లేదంటే అమ్మేయవచ్చునని చెబితే.. తాను అంత బలహీనుడిని కాదని చెప్పారు. దెబ్బ కొడితే నాకు మరింతగా బలం వస్తుందని చెప్పారు.
తపస్సు చేసుకోవాల్సిందే
రాజకీయాలను తాను పూర్తిగా అర్థం చేసుకున్నానని, రాజకీయాలు క్లీన్గా ఉండాలి అని అనుకుంటే హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. సమాజాన్ని మార్చాలంటే బురదలోకి దిగాలని చెప్పారు. తన నీతి ఇతరులను మంచివాడిగా చేయాలని, అంతేకాదని ఇతరుల చెడు మనలను ఆ దారిలోకి నడిపించవద్దునని చెప్పారు. 2014లో చంద్రబాబు, జగన్లలో తక్కువ ఆరోపణలు ఉన్న టీడీపీకి సపోర్ట్ చేశానని స్పష్టం చేశారు. ప్యూరెస్ట్ రాజకీయాలు చేస్తానంటే కుదరదని, అలా అయితే తపస్సు చేసుకోవాలన్నారు. 2009లో ఓడిపోయిన దెబ్బతో బంతిలా తిరిగి పైకి వచ్చి పార్టీ పెట్టానని అంటున్నారు.
ఎందుకు తిరగలేదంటే?
జనసేన పార్టీని స్థాపించాక, 2014 తర్వాత పవన్ కళ్యాణ్ ఏపీలో బాగా ఎందుకు తిరగలేదనే ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెబుతున్నారు. తాను తిరగాలంటే తన వెంట కొందరు ఉండాలని, కనీసం వారికి తిండి అయినా పెట్టాలని, కారులో పెట్రోల్ కొట్టించాలని, అలాంటప్పుడు ఎలా తిరగగలమని ప్రశ్నించారు. తాను మనవళ్లు పుట్టాక రాజకీయాల్లోకి రాదల్చుకోలేదని, అందుకే ఇప్పుడు వచ్చానని చెబుతున్నారు. తనకు రాగానే ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదని, ప్రజలకు ఏదైనా చేయాలని ఉందని, తాను రాజకీయాల్లో చేసే పనులు ఉన్నతస్థానంలో నిలబెడితే పాదాలకు నివేదన చేస్తానని చెబుతున్నారు.