ఏపీకి రాజధాని ఎక్కడ? జగన్ చెప్పిన మాటలు మరిచారా?: గందరగోళమంటూ పవన్ కళ్యాణ్
అమరావతి: మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్లు ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మరో కొత్త సమగ్రమైన బిల్లుతో ముందుకు వస్తాయని స్పష్టం చేసింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయం మరింత గందరగోళానికి దారితీసిందని, రాష్ట్రానికి తీవ్ర నష్టం తీసుకొచ్చేలా ఉందని మండిపడుతున్నారు.
హైకోర్టు నుంచి తప్పించుకునేందుకే: వైసీపీ సర్కారుపై పవన్ ఫైర్
తాజాగా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంపై స్పందించారు. హైకోర్టు నుంచి తప్పించుకోవడానికే మూడు రాజధానుల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం హడావుడిగా నిర్ణయం తీసుకుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మరింత స్పష్టతతో కొత్త బిల్లును సభలో ప్రవేశపెడతామని చెప్పి ఏపీ ప్రజలను మరింత గందరగోళానికి గురిచేశారన్నారు. రాజధాని అమరావతికి సంబంధించి 54 కేసులపై హైకోర్టులో చురుగ్గా విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఓటమి తప్పదని గ్రహించి తాత్కాలికంగా కోర్టు నుంచి తప్పించుకునేందుకే బిల్లుల రద్దుకు జగన్ ప్రభుత్వం ఉపక్రమించిందని ప్రజలంతా భావిస్తున్నారని పవన్ అన్నారు.

ఏపీకి రాజధాని ఉందా? అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్న
కోర్టు తీర్పుతో ఈ గందరగోళానికి తెరపడుతుందని భావిస్తున్న తరుణంలో కొత్త నాటకానికి తెరతీసిందని ఏపీ సర్కారుపై మండిపడ్డారు. నవ్యాంధ్ర ఏర్పడి ఏడున్నరేళ్లు అవుతున్నా.. రాజధాని ఎక్కడుంటుందో తెలియని స్థితికి పాలకులు తీసుకొచ్చారన్నారు. వికేంద్రీకరణతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమంటూ పలు రాష్ట్రాలను ఉదాహరణగా చూపించి చిలకపలుకులు పలుకుతున్న పాలకులు.. ఏ రాష్ట్రంలోనూ మూడు రాజధానులు లేవన్న విషయాన్ని విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు.

వైసీపీ పెద్దలు భ్రమల్లోనే మునిగితేలుతున్నారు..
మూడు రాజధానుల ఏర్పాటుతోనే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందన్న భ్రమల్లో వైసీపీ పెద్దలు మునిగితేలుతున్నారని ఎద్దేవా చేశారు. అమరావతిపై రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఒకే రాజధాని చాలని ఒకే మాటపై నిలవగా వైసీపీ మాత్రమే మూడు రాజధానులపాట పాడుతోందని మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి 33వేల ఎకరాలు ఇచ్చి తమ త్యాగ నిరతిని చాటి చెప్పిన అమరావతి రైతులకు జనసేన బాసటగా నిలుస్తుందని అన్నారు. ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు రాష్ట్రమంతటికీ విస్తరించాలని, రాజధానిగా మాత్రం అమరావతి ఒక్కటే ఉండాలని తాము కోరుకుంటున్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Recommended Video

అధికారంలోకి వచ్చాక జగన్ చెప్పిన మాటలు మరిచారు: పవన్
30 వేల ఎకరాలలో కన్నా తక్కువలో రాజధాని ఏర్పాటు చేయరాదని నాడు అసెంబ్లీలో చెప్పిన మాటలు అధికారంలోకి రాగానే జగన్ మరిచారని ధ్వజమెత్తారు. రాజధాని కోసం రోడ్డెక్కిన రైతులను మందడం, రాయపూడి, చదలవాడ లాంటి చోట్ల లాఠీ ఛార్జీలు చేసి భయోత్పాతానికి గురి చేశారని మండిపడ్డారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులపై 3వేలకు పైగా కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. మహిళలపై కూడా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.












Click it and Unblock the Notifications