కుల పార్టీ, జనసేన పంథా, 2014 పోటీ.. వీటన్నింటికి పవన్ దిమ్మతిరిగే సమాధానాలు!
అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో 175 స్థానాల్లో పోటీ చేస్తామని, త్వరలో ప్రజల ముందుకు వస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలతో భేటీ అనంతరం ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేశారు. జనసేన ఏ కులానికి చెందిన పార్టీ కాదని చెప్పారు.
ఏపీలో 175 స్థానాల్లో పోటీ, మీ ముందుకొస్తా: పవన్, జనసేన వ్యూహకర్తగా దేవ్ నియామకం
వారసత్వ రాజకీయాలకు దూరమని పలు పార్టీలకు కౌంటర్ ఇచ్చారు. మనం ప్రజా రాజకీయం చేస్తున్నామని, ఇది ఇతర పార్టీలకు అర్థం కాదన్నారు. పవన్ ఏపీలోని 13 జిల్లాల నుంచి వచ్చిన పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఎన్నికల ప్రణాళికలు, సంస్థాగత నిర్మాణపరమైన విధానాల రూపకల్పనకు దేవ్ పార్టీతో ఉంటారని, గత పది నెలలుగా ఆయన జనసేనకు పని చేస్తున్నారని తెలిపారు.
జనసేనకు అనుభవం లేదనే వారికి దిమ్మతిరిగే కౌంటర్
పార్టీకి అనుభవం లేదని ప్రత్యర్థులు అంటుంటారని, కానీ జనసేనకు పార్టీగా అనుభవం లేకపోవచ్చు కానీ పార్టీలోని ప్రతి కార్యకర్తకు రెండు ఎన్నికల్లో క్రియాశీలకంగా పని చేసిన అనుభవం ఉందని కౌంటర్ ఇచ్చారు. జనసేన పార్టీకి మనది తొలితరం అని, అందరం మధ్య తరగతి, చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లమేనని చెప్పారు. మన పార్టీకి లక్షల మంది అన్ని ఊళ్లలో ఉన్నారని, క్రమశిక్షణ, బలమైన భావజాలంతో జనసేన నిర్మితం అవుతుందన్నారు.
కొన్ని కుటుంబాల చేతుల్లో రాజకీయం, పోటీ చేయాలనుకున్నా
కొద్దిమంది చేతుల్లో, కొన్ని కుటుంబాల చేతుల్లోనే రాజకీయాలు ఉండిపోవడంతో అభివృద్ధి, వారి ఫలాలు అందరికీ చేరడం లేదని పవన్ అన్నారు. పరోక్షంగా వారసత్వ రాజకీయాలపై ఆయన స్పందించారు. అందరికీ న్యాయం జరగడం లేదని, సగటు మనిషి, అణగారిన వర్గాల బలమైన గొంతు మన పార్టీ అన్నారు. గత ఎన్నికల్లో 70 నుంచి 80 అశెంబ్లీ స్థానాల్లో, 8 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని అనుకున్నానని, తర్వాత పరిస్థితుల్లో ఎన్డీయేకు సహకరించామని చెప్పారు.
అందుకే పోటీ చేయలేదు, జనసేన పంథా వారికి అర్థం కాదు
ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే ముందు క్షేత్రస్థాయి పరిస్థితులు, సమస్యలు, ప్రజల ఇబ్బందులపై అవగాహన అవసరమన్నది తన ఉద్దేశ్యమని పవన్ చెప్పారు. అవేవీ లేకుండా పోటీ చేస్తే ఎప్పటికీ నేర్చుకునే అవకాశముండదన్నారు. గిరిగీసుకొని కూర్చొని, సంప్రదాయ విధానాల్లో రాజకీయాలు చేసే వారికి మన జనసేన పంథా అర్థం కాదన్నారు. పార్టీ సిద్ధాంతాలను ఎంతో లోతుగా అధ్యయనం చేసి రూపొందించామని, పార్టీ ఏ ఒక్క కులానికో ప్రాతినిథ్యం వహించదన్నారు.
టీడీపీకి షాక్
కులం అనే భావన ఉంటే 2014లో తెలుగుదేశం పార్టీకి ఎలా సహకరిస్తామని పవన్ అన్నారు. తద్వారా టీడీపీ ఓ కులానికి చెందిన పార్టీగా ముద్రపడిందన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేసారు. కులాలకు అతీతంగా మనం ఆలోచిద్దామన్నారు. కుల, మత సామరస్యం కాపాడటం ముఖ్యమని జనసేన నమ్ముతుందన్నారు. ప్రతిభావంతులైన కార్యకర్తలకు వేదిక అన్నారు. బలమైన మేధస్సుతో కూడిన కార్యకర్తలు జనసేనకు ఉన్నారని, ఇది ఒక కుటుంబం అని, కులానికి సంబంధించిన పార్టీ కాదన్నారు.
దేవ్ సహకారం ఆ తర్వాత కూడా
ఎన్నికల సమయంలో అనుసరించే విధివిధానాలకే మన పార్టీకి ప్రొఫెషనల్ సహకారం అవసరం ఉందని, అందుకే దేవ్ను ముఖ్య రాజకీయ వ్యూహకర్తగా తీసుకున్నామని చెప్పారు. ఎన్నికల సమయంలోనే కాదు, ఎన్నికల తర్వాత కూడా ఆయన సేవలు వినియోగించుకుంటామన్నారు. జనసేన కొద్ది స్థానాల్లోనే పోటీ చేస్తుందని ఎప్పుడూ చెప్పలేదని, ఏపీలో 175 స్థానాలకు పోటీ చేస్తామని, నేను కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఉన్న కార్యకర్తలు దేవ్ టీం కలిసి ఎన్నికల ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తారన్నారు. 1200 మంది సీపీఎఫ్ కార్యకర్తలు దేవ్కు సహకరిస్తారని, 350 మందితో దేవ్ టీం ఉంటుందని, బూత్ స్థాయి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కమిటీలు ఎలా ముందుకు వెళ్లాలో బలమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్నారు. తెలంగాణలో బలోపేతం చేస్తున్నామని, ఆగస్టు రెండో వారం నాటికి పోటీకి సంబంధించి ప్రాథమిక ప్రణాళిక ప్రకటిస్తామన్నారు.
48 గంటల్లో ప్రజల మధ్యలో ఉంటా
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సాధనపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రజా సమస్యలను తెలియజేసేలా ప్రజల మధ్యలోకి వెళ్దామన్నారు. ఈ నెల 11వ తేదీన పర్యటనకు సంబంధించి వివరాలు చెబుతానని, ఏ ఊరు నుంచి యాత్ర చేపట్టేది చెబుతానని, నేను ప్రకటించిన 48 గంటల్లో ప్రజల మధ్యలో ఉంటానని చెప్పారు.