ఓట్ల చీలిక -అధికారంపై టీడీపీకి అర్దమయ్యేలా : పవన్ కీలక వ్యాఖ్యలు..!!
ఓట్ల చీలికపై జనసేన అధినేత పవన్ స్వరంలో మార్పు వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం..ఇప్పటి వరకు చెబుతూ వచ్చిన మాట. కానీ, ఇప్పుడు ఎవరికి మద్దతుగా నిలుస్తారనుకుంటే వారికే మొత్తం గా ఓట్లు వేయండి అంటూ పవన్ చెబుతున్నారు. మీలో మీరు విడిపోయి మనల్ని మనమే పలచన చేసుకోవద్దు అంటూ పవన్ కల్యాణ్ సూచించారు. కొద్ది మందే ఆధిపత్యం చెలాయించే పరిస్థితి మారాలంటే 2024 నుంచి వచ్చే రెండు ఎన్నికలు కీలకమన్నారు. పరోక్షంగా 2029 వరకు టార్గెట్ ఫిక్స్ చేసారు. పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చకు కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలతో టీడీపీతో పొత్తు పై ఆలోచన ఏంటో స్పష్టత వస్తోంది.
పవన్ వ్యాఖ్యలు..మారుతున్న సమీకరణాలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పు కాపులతో సమావేశం అయ్యారు. ఆ సమయంలో ఓట్ల చీలక గురించి మరోసారి ప్రస్తావించారు. మీ ఓటును చీలనివ్వకండి.. జనసేనకే ఓటు వేయాలని చెప్పను అంటూనే జనసేన మీకు నిలబడుతుందనుకుంటే తమకు ఓటు వేయాలని, మరో పార్టీ నిలబడుతుందునుకుంటే పూర్తిగా వారికే ఓటు వేయాలంటూ పవన్ చేసిన వ్యాఖ్యలతో కొత్త విశ్లేషణలు మొదలయ్యాయి.
2024 నుంచి రెండు ఎన్నికల్లో బలంగా నిలిస్తే రాష్ట్ర భవిష్యత్ బీసీల చేతిలో ఉంటుందన్నారు. తేకపోతే కొద్దిమంది ఆధిపత్యం చెలాయిస్తారని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి మారాలి. దీనిని తగినట్లుగా అడుగులు వేస్తామని.. ఆశీస్సులివ్వాలని పవన్ కోరారు. దీని ద్వారా వైసీపీ - టీడీపీ నేతల ఆధిపత్యం గురించే పవన్ ప్రస్తావించారనే విశ్లేషణలు మొదలయ్యాయి.
ఓట్ల చీలిక - అధికారం పైన కీలక వ్యాఖ్యలు
వైసీపీకి ఓట్లు వేసి 151 సీట్లు ఇచ్చినా..ఆ పార్టీ సమస్యలపైన చర్చించ టం లేదని పవన్ వ్యాఖ్యానించారు. మంత్రి బొత్సా గురించి ప్రస్తావించారు. బొత్సా పెద్ద నాయకుడిగా ఉన్నా, ఆయన అధినాయకత్వానికి లొంగి ఉండాల్సిందేనన్నారు. ఆయనే అలా ఉంటే సగటు తూర్పు కాపు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని పేర్కొన్నారు.
ఎవరైనా అధికారంలోకి రావాలంటే అన్ని కులాలు ఓట్లు వేయాల్సిందేనని చెప్పుకొచ్చారు. తక్కువ సంఖ్య బలం ఉన్న కులాల్లోనే ఐక్యత ఉందన్నారు. మనలో నాయకత్వం పెంచుకోవాలి.. అధికారం లేని ఏ కులమైనా ముందే సంఘటితం కావాలని పవన్ సూచించారు. మనోధైర్యం ఉన్న బీసీ నాయకులను రాజకీయంగా ప్రోత్సహించాలని పవన్ కల్యాన్ పిలుపునిచ్చారు. ఓడిపోయినా తాను రాజకీయాల్లో బలంగా నిలబడ్డానని వివరించారు.
సొంతంగా ఎదిగేందుకే పవన్ ప్రాధాన్యత
ఈ ముఖ్యమంత్రి ఏమీ మాట్లాడరని, తాను ఉద్దానం వెళ్లలేదన్న మహానుభావుడని పవన్ వ్యంగాస్త్రం సంధించారు. ఆయన కోడికత్తి డ్రామాలో ఉంటే, తాను ఉద్దానం వెళ్లానని పవన్ చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర పైన ప్రేమ ఉన్న తనకు నమ్మకం సాధించుకునేందుకు పదేళ్లు పట్టిందన్నారు. తన పైన నమ్మకం ఉంచాలని, అధికారం దిశగా అడుగులు వేయించాలని కోరారు.
ఎవరినీ దేహీ అని అడగాల్సిన అవసరం లేదన్నారు. తమను నమ్మాలని..వారి సమస్యల పరిష్కారానికి అండగా నిలుస్తానంటూ పవన్ హామీ ఇచ్చారు. విశాఖ కేంద్రంగా ప్రధానితో పవన్ భేటీ తరువాత టీడీపీతో సంబంధాల పైన మార్పు వచ్చిందనే ప్రచారం సాగుతోంది. ఇప్పుడు పవన్ చేస్తున్న వ్యాఖ్యలు..వివరిస్తున్న లక్ష్యాలతో రాజకీయంగా పవన్ ఏం చేయబోతున్నారనే దాని పైన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు..విశ్లేషణల పైన టీడీపీలోనూ చర్చ మొదలైంది.