పవన్ కల్యాన్ ఓ బ్రాండ్: 'పవర్' స్టార్దే మెగా 'పంచ్'
హైదరాబాద్: మెగాస్టార్ కుటుంబంతో సహా టాలీవుడ్ పరిశ్రమలోని పలువురు నటులు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరుతోనే పవర్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం మెగా సోదరుల అల్లుడు సాయి ధరమ్ తేజ్ 'రేయ్' ఆడియో ఫంక్షన్లోను పవన్నామ స్మరణం మారుమోగింది. పవన్ మాత్రం.. నటన అంటే వారసత్వమో లేక కుటుంబం నుంచి వచ్చే సంపదో కాదని, ఎవరు ఏం సాధించాలన్నా వారి మనసులో దృఢమైన సంకల్పం ఉండాలన్నారు.
ప్రస్తుతం టాలీవుడ్లో పవర్ స్టార్ ఓ హీరో కాదు.. బ్రాండ్ అంటున్నారు. చాలామంది తమ సినిమాలకు పవన్ ఆశీస్సులే కోరుకుంటున్నారు. పవన్ 'గబ్బర్ సింగ్' వరకు కొన్నేళ్లుగా హిట్ ముఖం చూడలేదు. అయినా పవర్ స్టార్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. సరికదా గబ్బర్ సింగ్తో తన సత్తా చాటారు. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడు పవన్ ఆశీస్సుల కోసం చూస్తున్నారు. ఒక విధంగా ఇప్పుడు మెగా బ్రాండ్ కంటే పవన్ బ్రాండే వినిపిస్తోందని అంటున్నారు.

హీరో నితిన్ పవన్కు పెద్ద అభిమాని. ఇటీవల పలు చిత్రాల్లో నితిన్ పవర్ స్టార్ పైన తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. రాజకీయాల విషయంలో చిరంజీవితో పవన్ విభేదిస్తున్నారని, వారి మధ్య మనస్పర్థలు వచ్చాయనే ప్రచారం జరిగినప్పటి నుండి ఇతర మెగా హీరోల సినిమా ఫంక్షన్లకు పవర్ స్టార్ రాకపోవడం చర్చనీయాంశమైంది. ఆయన ఎందుకు రాలేదో వారు అభిమానులకు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో చిరంజీవి విలీనం చేయడం పవన్కు ఏమాత్రం ఇష్టంలేదని, ఈ విషయంలోనే సోదరుల మధ్య మనస్పర్థలు వచ్చాయని, అందుకే పవన్ దూరంగా ఉంటున్నారనే గతంలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పవన్ తెలుగుదేశం పార్టీలోకి, ఆమ్ ఆద్మీ పార్టీలోకి వెళ్తారని, ప్రజారాజ్యం పార్టీని పునరుద్దరిస్తారనే రూమర్స్ జోరుగా వినిపించాయి. చిరు రాజకీయ నిర్ణయంపై పవన్ ఇప్పటికీ అసంతృప్తితోనే ఉన్నారంటారు.
ఈ నేపథ్యంలో టాలీవుడ్లో పవర్ బ్రాండ్ బాగా పని చేస్తోందనే వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. చిరంజీవి పేరు వినిపించడం లేదని కాదు కానీ, పవన్ పేరుకే ప్రాధాన్యత కనిపిస్తోందని అంటున్నారు. అయితే, చిరంజీవి, పవన్ వేర్వేరు కాదని ఎవరు పేరు వినిపించినా కుటుంబం ఒక్కటేనని అభిమానులు చెబుతున్నారు.
రేయ్ ఆడియో ఫంక్షన్లో కూడా హీరో, దర్శకులు మొదలు పవన్నామస్మరణ చేసిన విషయం తెలిసిందే. హీరో సాయి ధరమ్ మాట్లాడుతూ.. పవన్కు స్పెషల్ థ్యాంక్స్ అని, ఆడియో ఫంక్షన్కు వచ్చి విలువైన సమయం ఇచ్చారని, మాలో ఉత్సాహం నింపారని, గుండెల్లో ధైర్యం నింపారని, పవన్ ఇచ్చిన ప్రోత్సాహమే ఈ రేయ్ అన్నారు. తాను చిరు నుండి కృషి, పట్టుదల, నాగబాబు నుండి విధానం, నవ్వు, పవన్ నుండి క్రమశిక్షణ, నిబద్దత నేర్చుకున్నానని చెప్పారు.
డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ.. తాను అందరిలాగే పవన్ కల్యాణ్ అభిమానిని అని చెబుతూ.. ఒక్కసారి హగ్ చేసుకోవాలని ఉందని పవర్ స్టార్ను అడిగారు. ఎన్టీఆర్ హార్డ్ వర్క్, పవన్ నమ్మకం అంటూ వ్యాఖ్యానించారు. కథానాయికలు కూడా పవన్ పేరు జపించారు.
''ఎవరు ఏం సాధించాలన్నా వారి మనసులో దృఢమైన సంకల్పం ఉండాలి. నటన అంటే వారసత్వమో లేక కుటుంబం నుంచి వచ్చే సంపదో కాదు. సాయి ధరమ్ తేజ్ సినిమాల్లోకి వస్తానన్నప్పుడు వాడికి నేను ఈ మాటలే చెప్పాను. అభిమానాన్ని, ప్రేమని కొనలేము. మనలో నిజాయితీ ఉండాలి. అప్పుడే ఈ రెండూ లభిస్తాయి. దీంతో పాటు విజయం కూడా లభిస్తుంది. సాయి కోసం నేనేమీ చేయలేదు. నాకు తెలిసిన గురువు దగ్గరకు మాత్రమే పంపించాను. సలహాలు ఇచ్చి ఎంకరేజ్ చేసే స్థాయి నాకు లేదు. నేను పొరపాటుగా సినిమాలోకి వచ్చాను, ఇష్టం లేదు. సినీ పరిశ్రమ ఏ ఒక్కరి కుటుంబం కాదు, మా కుటుంబానిదీ కాదు. కొత్త వారు రావాలి'' అన్నారు పవన్.












Click it and Unblock the Notifications