నాడు పవన్-వెంకయ్య కౌంటర్లు.. నేడు దోస్తీ: '2019' అనుమానాలు
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను భారతీయ జనతా పార్టీ దువ్వుతున్నట్లుగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ - టీడీపీ కూటమికి పవన్ జోరుగా ప్రచారం చేశారు. ఆ కూటమి విజయంలో ఆయన పాత్ర చాలానే ఉందని చెప్పవచ్చు. అయితే, 2019 లక్ష్యంగా వెళ్తున్న బీజేపీ పవన్ను పూర్తిగా తమ వైపుకు తిప్పుకునే పనిలో పడినట్లుగా అందరు భావిస్తున్నారు.
2019 నాటికి టీడీపీతో బీజేపీ పొత్తు విషయమై ఇప్పుడే పలువురిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణతో పాటు ఏపీలోను బలోపేతం చేసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పావులు కదుపుతున్నారు. అయితే, బీజేపీ బలోపేతం అంటే టీడీపీని బలహీనపర్చడం కాదని ఆయన చెప్పారు. కానీ, బీజేపీ బలపడితే 'మహారాష్ట్ర' తిరిగి పునరావృతం కావొచ్చు.
నాడు విమర్శ.. ప్రతివిమర్శ.. నేడు దోస్తీ!
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెడతారనే ప్రచారం నేపథ్యంలో అప్పుడు... ప్రస్తుత కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆయన పైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యకు పవన్ కూడా ధీటుగానే సమాధానం ఇచ్చారు. పవన్ పార్టీని పెట్టే విషయాన్ని ప్రస్తావిస్తూ.. పవన్ కళ్యాణ్ లోక కళ్యాణం కోసమా అని ఆయన ప్రశ్నించారు. దానికి పవన్ మరింత ఘాటుగా స్పందించారు.
అనంతరం బీజేపీకి, నరేంద్ర మోడీకి పవన్ మద్దతు ప్రకటించారు. అలాగే టీడీపీ - బీజేపీ కూటమిగా ఏర్పడటంతో పవన్ ఆ కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. ఎన్నికల అనంతరం మోడీ, బీజేపీ నేతలు ప్రత్యేకంగా పవన్కు కృతజ్ఞతలు తెలిపారు. నాడు కౌంటర్లు విసిరుకున్న పవన్, వెంకయ్యల మధ్య ఇప్పుడు దోస్తీ మరింత బాగా కుదిరిందని అంటున్నారు.
ఏపీలో బీజేపీ బలోపేతం కోసమే...
ఏపీలో బీజేపీని బలోపేతం చేసే క్రమంలో భాగంగానే బీజేపీ లేదా వెంకయ్యలు పవన్ కళ్యాణ్కు మంచి ప్రాధాన్యత ఇస్తున్నాయని అంటున్నారు. పవన్కు బీజేపీ ఇచ్చే ప్రాధాన్యత చూస్తుంటే 2019 ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ జత కడుతుందా? అనే అనుమానాలు పలువురిని తొలుస్తున్నాయి.
వచ్చే ఎన్నికల నాటికి జనసేనను తమ పార్టీలో విలీనం చేసుకోవడం లేదా పవన్కు మంచి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా.. టీడీపీకీ పక్కన పెట్టే అవకాశాలను కొట్టి పారేయలేమని అంటున్నారు. పవన్కు కారణంగా... ఒకవిధంగా బీజేపీ పైన పలువురు టీడీపీ నేతలు కూడా కొంత అనుమానంగానే ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
వెంకయ్యతో బాబుకు మంచి దోస్తీ
అదే సమయంలో వెంకయ్య నాయుడుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దోస్తీని కూడా పరిగణలోకి తీసుకోవాలనే వాదనలు లేకపోలేదు. వెంకయ్య, చంద్రబాబు మధ్య ఇటీవల మంచి సంబంధాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో ఇటు పవన్తో, అటు టీడీపీతో స్నేహం దెబ్బతినకుండా బీజేపీ వెళ్తోందని కూడా అంటున్నారు.