మహా కుంభమేళాలో సనాతనధర్మంపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహా కుంభమేళాలో కుటుంబంతో కలిసి సంగమ స్నానం ఆచరించిన తర్వాత ఆయన సనాతన ధర్మం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేల సంవత్సరాలుగా కుంభమేళా జరుగుతున్నట్టు చరిత్ర చెబుతుందని తాను గతంలో ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం చదివినప్పుడు అందులో కుంభమేళా గురించి వివరిస్తూ ఉన్న వాక్యాలు చదివానని పవన్ కళ్యాణ్ తెలిపారు.
మహా కుంభమేళాపై పవన్ అభిప్రాయమిదే
తాను మూడు దశాబ్దాలుగా కుంభమేళాను గమనిస్తున్నానని, ప్రతిసారి రావాలని భావించినా కుదరలేదని ప్రస్తుతం మహాకుంభమేళాలో పాల్గొనడం చాలా ఆనందం కలిగిస్తుంది అన్నారు. భారతీయులంతా విభిన్నమైన జాతులు, తెగలు, సాంప్రదాయాలను ఆచరిస్తున్నప్పటికీ సనాతన ధర్మం విషయంలో మాత్రం ఏకమవుతున్నారని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. దేశం విషయంలో భిన్నత్వంలో ఏకత్వం ఎలా పనిచేస్తుందో ధర్మం విషయంలో కూడా భారతీయులలో అదే రకమైన ఏకత్వం పనిచేస్తుందన్నారు.

మహా కుంభమేళాలో దురదృష్టకర సంఘటనలపై పవన్ కళ్యాణ్
వేల సంవత్సరాలుగా సనాతన ధర్మం పరిఢవిల్లుతోందని, భవిష్యత్తులోనూ అలానే ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 50 రోజులుగా 50 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించిన మహా కుంభమేళాలో జరిగిన కొన్ని సంఘటనలు దురదృష్టకరమని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక సనాతన ధర్మాన్ని పాటించే వారిపైన కొందరు నేతలు ఇష్టానుసారంగా మాట్లాడటం బాధ్యత రాహిత్యమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
దురదృష్టకర ఘటనలపై కొందరు స్పందిస్తున్న తీరు బాధాకరం
భారీ సమూహం ఉన్నచోట దురదృష్టకర సంఘటనలు జరిగే అవకాశం ఉందని, దాన్ని మొత్తంగా సనాతన ధర్మానికి ఆపాదించి ఇష్టానుసారంగా వ్యాఖ్యానించటం మంచిది కాదన్నారు. ఇలాంటి దుర్ఘటనలు ఇతర మతాలను ఆచరిస్తున్న, ఇతర మత ధర్మాలను పాటించే కార్యక్రమాలలో జరిగితే రాజకీయ నాయకులు ఇలాగే స్పందించే వాళ్ళా అంటూ ప్రశ్నించారు. ఇటీవల తిరుపతిలో జరిగిన దుర్ఘటనకు ముందు కూడా పక్కాగా ఏర్పాట్లు చేసినా, ఒకేసారి సమూహం కదలి రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుందన్నారు.
ప్రపంచంలోనే ఇటువంటి మహా కార్యక్రమం ఇప్పటివరకు జరగలేదు
ఇలాంటి దుర్ఘటనలు దేశంలో ఏ ప్రాంతంలో జరిగినా అక్కడ పరిస్థితిని అర్థం చేసుకొని తదనుగుణంగా స్పందిస్తే బాగుంటుందని సనాతన ధర్మాన్ని ఆచరించే వారి మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడం మంచిది కాదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ . దాదాపు దేశంలోని సగం జనాభా కుంభమేళాకు తరలిరావడం చాలా గొప్ప విషయమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే ఇటువంటి మహా కార్యక్రమం ఇప్పటివరకు జరగలేదన్నారు ఇది సనాతన ధర్మం ఆచరించే మహా పండుగని భావిస్తున్నానని తెలిపారు.












Click it and Unblock the Notifications