మన్యంలో పవన్ టూర్-డోలీ కష్టాలకు చెక్ పెట్టేలా రోడ్లకు శ్రీకారం..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా మన్యంలో డోలీ కష్టాలు తీరలేదన్న విమర్శలు ఎదురవుతున్న వేళ ఇవాళ పార్వతీపురం మన్యం జిల్లాకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్ల నిర్మాణానికి శంఖుస్థాపనలు చేశారు. ప్రతికూల వాతావరణంలోనూ మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లిన పవన్.. గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో కలిసి రోడ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. పవన్ రాకతో మన్యంలో సందడి నెలకొంది.
ఇవాళ ఉదయం విశాఖ నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు బయలుదేరి పవన్ కళ్యాణ్ .. వాతావరణ పరిస్ధితులు అనుకూలించకపోయినా ప్రయాణం కొనసాగించారు. సాలూరు నియోజకవర్గం పనసభద్ర పంచాయతీ బాగుజోలకు వెళ్లిన పవన్ అక్కడ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న 19 రోడ్ల నిర్మాణాలకు శంఖుస్థాపన చేశారు. వీటితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంఖుస్దాపనలు చేశారు. మన్యం జిల్లాలో దాదాపు 36.71 కోట్ల వ్యయంతో, 39.32 కి.మీ.మేర కొత్త నిర్మాణం జరగనుంది. ఈ రోడ్ల నిర్మాణంతో 55 గిరిజన గ్రామాలకు చెందిన 3782 మందికి డొలీ బాధల నుంచి విముక్తి కలగనుంది.

2015లో పోరాట యాత్ర సమయంలో తాను పాడేరు, అరకుతో పాటు గిరిజన ప్రాంతాల్లో తిరిగానని, ఇక్కడ రోడ్లు, తాగునీరు, ఉపాధి అవకాశాలు కావాలని గిరిజనులు కోరారని పవన్ తెలిపారు. ఇప్పటివరకూ ఈ ప్రాంతానికి రావాలని ఎవరూ ఆలోచించలేదని, ఇక్కడ 70 ఏళ్లుగా రోడ్లు లేవని సీఎం చంద్రబాబుకు చెప్పినట్లు పవన్ తెలిపారు. ఐదేళ్ల పాలనలో వైసీపీ రోడ్లు వేయలేదని, కానీ తాము వచ్చిన ఐదు నెలల్లోనే డబ్బుల్లేకపోయినా రోడ్లు వేయాలని ముందుకొచ్చినట్లు పవన్ వెల్లడించారు. గిరిజనుల కోసం ఎండనక, వాననక పనిచేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్దంగా ఉందని పవన్ తెలిపారు.












Click it and Unblock the Notifications