జగన్ రెడ్డి గారూ! ఇది మీకు సిగ్గుచేటు.. చిల్లరగానా..: టీడీపీలా కాదంటూ ఏకిపారేసిన పవన్ కళ్యాణ్
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాము ప్రభుత్వ పాలసీలు, ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమస్యలను పక్కదారి పట్టించడానికి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు.

సంస్కారం మరిచి..
వైసీపీ నాయకులు భాషాసంస్కారాలు మరిచి ఎంత హీనంగా మాట్లాడినా తాము మాత్రం ప్రభుత్వ విధివిధానాలపైనే మాట్లాడతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.

50మంది ఆత్మహత్య చేసుకుంటే..
‘రాష్ట్ర ఆర్ధిక ప్రగతిని ప్రభుత్వ ఇసుక విధానం దెబ్బ తీసింది. గత ప్రభుత్వంలో తప్పిదాలు జరిగితే సరిదిద్దుకొని ముందుకెళ్లాలి తప్ప.. నూతన ఇసుక పాలసీ పేరుతో మొత్తానికే ఇసుక సరఫరా నిలిపివేశారు. అవగాహన లేకో.. లేకపోతే వేరే విధంగా లబ్ధి పొందడానికో తెలియదు కానీ నాలుగు నెలలుగా ఇసుక సరఫరా నిలిపివేశారు. దీంతో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ కార్మికులు పనులు లేక రోడ్డునపడ్డారు. ఈ విషయాన్ని ఈ రోజు రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ గారికి వివరించాం. దాదాపు 50 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. లక్షన్నర మందితో విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చేస్తే రూ. 5 లక్షల చొప్పున ఐదుగురికి మాత్రమే నష్టపరిహారం చెల్లించారు' అని పవన్ కళ్యాణ్ చెప్పారు.

టీడీపీలా కాదంటూ వార్నింగ్
‘ఇసుక పాలసీ గురించి, తెలుగు భాష గురించి మాట్లాడితే.. సమస్యను పక్కదారి పట్టించడానికి జగన్ రెడ్డి, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా తిడుతున్నారు. నన్ను వ్యక్తిగతంగా దూషించే వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నాను.. మీరు తిడితే తెలుగుదేశం పార్టీ నాయకలుపడతారేమో.. జనసేన పార్టీని నేతలు పడరు. ప్రభుత్వ విధివిధానాల్లో లోపాలు ఉంటే కచ్చితంగా ప్రశ్నిస్తాం. నోటికి వచ్చినట్లు మాట్లాడేవాళ్లం కాదు. ప్రజా సమస్యలు తీర్చడానికి ప్రభుత్వానికి విలువైన సలహాలు, సూచనలు కూడా చేస్తాం. అందులో భాగంగానే ఇవాళ గవర్నర్ని కలిసి ఇసుక పాలసీపై 18 పాయింట్లతో కూడిన నివేదిక అందించాం. పర్యావరణం దెబ్బతినకుండా ఎలా ఇసుక ను సరఫరా చేయాలో నివేదికలో పొందుపరిచాం' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకు వెళ్లారా?
‘ప్రభుత్వ పాలసీలపై ఒక వ్యక్తి ప్రశ్నిస్తే.. ఆ వ్యక్తి కులానికి సంబంధించిన వ్యక్తులతో తిట్టించడం వంటి కుటిల రాజకీయాలకు జనసేన పార్టీ విరుద్దం. జగన్ రెడ్డి గారిని తాము ఎప్పుడు ఒక కులంగా చూడలేదు. ఒక వ్యక్తిగానే చూశాం. జగన్ రెడ్డి గారిని ఒక మాట అంటే ఆయన కులస్తులను అన్నట్లు ఎంతమాత్రం కాదు. జగన్ రెడ్డికి విన్నపం ఏంటంటే.. నేను మిమ్మల్ని విమర్శిస్తున్నప్పుడు కేవలం కాపు కులానికి సంబంధిన వ్యక్తులే నన్ను విమర్శించక్కర్లేదు. మిగతావాళ్ల కూడా విమర్శించవచ్చు. నన్ను విమర్శిస్తే కాపుల ఓట్లు పోతాయని భయం కూడా అవసరం లేదు. తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లి కాపు రిజర్వేషన్కు వ్యతిరేకం అన్నా మీకు ఓట్లు వేశారు. ప్రజాసమస్యలపై పోరాటంలో మా పార్టీ విధివిధానాలు అయితే మారవు. మేము కచ్చితంగా ప్రశ్నిస్తాం. అవసరమైతే ఘాటుగా విమర్శిస్తాం' అని జనసేనాని తేల్చి చెప్పారు.

సిగ్గుచేటు.. చిల్లరగానా..
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా సమస్యను తప్పుదోవ పట్టించడానికి వ్యక్తిగత దూషణకు దిగడం సిగ్గుచేటని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలా కాకుండా.. వైసీపీ నాయకుడిలా చిల్లరగా మాట్లాడుతున్నారన్నారు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారంటే వారి పాలనలో లోపాలు ఉన్నాయని అర్ధమవుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు.


Click it and Unblock the Notifications