Pawan Kalyan : రణస్ధలం "యువశక్తి " పోస్టర్ విడుదల చేసిన పవన్-తడాఖా చూపుదామని పిలుపు..
ఏపీలో విపక్ష టీడీపీ యువగళం వినిపిస్తుండగా.. ఇప్పుడు ఆ పార్టీకి మిత్రుడైన జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా యూత్ పేరుతో ఓ సభ పెట్టేందుకు సిద్దమవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్ధలంలో ఈ నెల 12న జనసేన తరఫున యువశక్తి సభ నిర్వహించేందుకు పవన్ రెడీ అయ్యారు. దీనికి సంబంధించిన పోస్టర్ ఇవాళ విడుదల చేశారు.
స్వామి వివేకానంద జయంతి రోజైన జనవరి 12న ఆయన నింపిన స్ఫూర్తితో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి తడాఖా చూపించబోతోందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. అచంచలమైన ఉత్తరాంధ్ర యువతరంగాలను ఒకేచోటకు తీసుకొచ్చేలా, ఉత్తరాంధ్ర సమస్యలపై గళమెత్తేలా, సంస్కృతి, సంప్రదాయం, సాహిత్యం ప్రపంచానికి చాటిచెప్పేలా జనసేన పార్టీ జనవరి 12వ తేదీన రణస్థలంలో నిర్వహించబోయే ''యువశక్తి'' కార్యక్రమం పోస్టర్లను హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయంలో పవన్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే యువశక్తి కార్యక్రమానికి యువతీ యువకులను సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. యువతరాన్ని అత్యధికంగా కలిగిన దేశంగా భారతదేశానికి పేరని, దేశానికి వెన్నెముక వారని అన్నారు. ఉత్తరాంధ్ర యువతరం వలసల బాట పడుతోందని, చదువులకు సైతం వేరే ప్రాంతాలకు వారు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉందని పవన్ తెలిపారు. ఉపాధి దొరక్క పొట్ట చేతపట్టుకొని వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని, ఉత్తరాంధ్ర ప్రాంతంలోని వలసలు, ఉపాధి లేమి, విద్యావకాశాలు, వ్యాపార అవకాశాలు, ఇతర సమస్యలపై అన్నీ అంశాలపై సమగ్రంగా యువత అభిప్రాయాలు తెలియజేసేందుకు యువశక్తి కార్యక్రమం వేదిక అవుతుందన్నారు. ఎలాంటి ప్రభుత్వం ఉంటే బాగుంటుంది, ప్రభుత్వ పాలసీలు ఎలా ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాలు యువత తెలియజేసేందుకు యువశక్తి వేదిక గళమవుతుందన్నారు.
తనతోపాటు వేదికపై 100 మంది యువతీయువకులు కూర్చొని, ఉత్తరాంధ్ర పరిస్థితులు, సమస్యలతోపాటు కష్టాల నుంచి విజయాలు సాధించిన గొప్ప స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పేలా కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ఉత్తరాంధ్ర యువత కలలుగనే రేపటి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నది వారే ఆవిష్కరిస్తారన్నారు. వారి ఆలోచనలను, ఆవేదనలను వారి గొంతు నుంచే విందామన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఒక్కటే 'మన యువత... మన భవిత' అనేదే ప్రధాన నినాదంగా యువశక్తిని విజయవంతం చేద్దాం'' అన్నారు.