సినిమాల్లో కోటీశ్వరుడు... రాజకీయాల్లో 'పేదవాడు'!!
ఇప్పటంలో ఇల్లు కూల్చివేత బాధితులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ.లక్ష చొప్పున ప్రకటించారు. మొత్తం 53 మంది బాధితులున్నారు. వారందరికీ కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఇవ్వాలని పవన్ నిర్ణయించారు. ఇప్పటికే ఆయన గ్రామాభివృద్ధికి రూ.50 లక్షలు ఇచ్చారు. ఈ నగదు మొత్తం తాను సినిమాల్లో నటించడంద్వారా వచ్చిన రెమ్యునరేషన్ లో నుంచే ఇస్తున్నారు. దాంతో వారు ఇప్పటంలో కమ్యూనిటీ హాల్ కట్టుకున్నారు.
ఆర్థిక పరిస్థితి అంత అనువుగా లేదు!
వాస్తవానికి సినిమాల్లో నటించం మానుకొని పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించాలనుకుంటున్నప్పటికీ ఆర్థిక పరిస్థితి అనువుగా లేదు. ఇతర రాజకీయ పార్టీలకు వచ్చినట్లుగా విరాళాలుకానీ, ఎన్నారై ఫండ్స్ కానీ రావడంలేదు. ఇటీవలే పవన్ సోదరుడు నాగబాబు జనసేన నాయకులు, కార్యకర్తల నుంచి విరాళాలు సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ కూడా ఆ గ్రామంలోనే జరిగింది. అప్పటి నుంచి ఆయనకు ఇప్పటంతో అనుబంధం పెనవేసుకుపోయింది.
ఇప్పటి వరకు రూ.6కోట్లు పంపిణీ
పవన్ ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులుకు భారీగా సాయం చేసుకుంటూ వస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున అందజేస్తున్నారు. ఇప్పటివరకు ఆయన రూ.6కోట్ల నగదును అందజేశారు. మరోవైపు ఒక్క ఇప్పటం కోసమే కోటిరూపాయలు ఖర్చుచేస్తున్నారు. జనసేన పార్టీని నడిపించడానికి కూడా తన రెమ్యునరేషన్ నుంచే ఖర్చుచేస్తున్నారు. వచ్చిన విరాళాలు కూడా సరిపోవడంలేదు. అంతేకాకుండా టీడీపీ, వైసీపీల్లా వ్యాపారవేత్తలు, పారిశ్రాకమివేత్తలు ఫండింగ్ అందజేసేంతగా జనసేన ఎదగలేదు.
వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్న పవన్
పార్టీకి నగదు అవసరమవుతుందనే ఉద్దేశంతో ఇటీవలికాలంలో ఆయన వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం రెండు సినిమాలకు కాల్షీట్లు కేటాయించారు. ఈ రెండు సినిమాల షూటింగ్ మధ్యలో దొరికే విరామంతో పార్టీ కార్యక్రమాలకు హాజరుకాబోతున్నారు. బస్సు యాత్రను ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. యాత్ర ప్రారంభిస్తే మధ్యలో సినిమాలు చేయడానికి వీలుకాదు. మరో రెండు సినిమాలను ఒప్పుకొని తక్కువ కాలవ్యవధిలో విడుదల చేసేలా ప్రణాళిక వేసుకుంటున్నారు. సాధ్యమైనంత వేగంగా సినిమాల షూటింగ్ లు జరిగితే పార్టీని నడపడానికి అవసరమైన నగదు లభ్యమవుతుందనే యోచనలో జనసేనాని ఉన్నారు.