అరే సాంబా.. ప్రెస్ మీట్ ఎందుకురా..? ప్రెస్ నోట్ చాలు..! అసలే కరోనా కాలం అంటున్న పవన్ కళ్యాణ్..!!
అమరావతి/హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ డిస్టెన్స్ పక్కా పాటిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ నేత పాటించని సామాజిక దూరానికి పవన్ కట్టుబడి ఉన్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. వారితో పాటు కొంత మంది రాజకీయ నేతలు కూడా కరోనా మహమ్మారి వైరస్ పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మరికొంత మంది నేతలు ప్రజలకు ఏదైనా సమాచారం ఇవ్వదలుచుకున్నప్పుడు ఫేస్ బుక్, జూమ్ వంటి ప్రత్యక్ష ప్రసారాలను ఉపయోగించుకుంటున్నారు.
కరోనా కష్టాల్లో ఉన్నాం..పొరపాట్లు జరుగుతున్నాయ్..కానీ రాజకీయం మాట్లాడను.. పరిపక్వత చాటుకున్న పవన్.
ప్రెస్ మీట్లు వద్దు.. ప్రెస్ నోట్లే ముద్దంటున్న జనసైనికుడు..
అంతే కాకుండా ప్రెస్ మీట్ పేరుతో విలేఖరులు గాని, ఫోటో, వీడియో జర్ణలిస్టులు గాని గుంపులుగా ఉండకూదనే నిబంధన అమలులో ఉంది కాబట్టి సదరు నేతలు ప్రధాన మీడియాకు ప్రత్యామ్నాయంగా సందేశాలు పంపుతున్నారు. మీడియాను ఎప్పుడూ పక్కనే ఉంచుకునే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ప్రధాన ప్రసార మాధ్యమానికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా వేదిక ద్వరా తన సందేశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు చంద్రబాబు. ఇక దేశంలోని చాలా మంది ముఖ్య నేతలు మీడియా సమావేశాలను తాత్కాలికంగా రద్దు చేసుకుంటున్న అంశాలు కూడా తెరమీదకు వస్తున్నాయి.
సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్న పవన్.. ప్రెస్ నోట్లతోనే సందేశాన్ని పంపుతున్న కాటమ రాయుడు..
కాగా ఆంధ్ర ప్రదేశ్ లో ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మీడియాకు ఆమడ దూరం ఉంటున్నారు. కరోనా వైరస్ గురించైనా, కందుకూరి వీరేశలింగం పంతులు గురించైనా, జ్యోతీరావు పూలే గురించైనా, ఉద్యోగుల జీతాల గురించైనా ప్రెస్ నోట్లతోనే తన సందేశాన్ని అందిస్తున్నారు పవన్ కళ్యాణ్. కరోనా మహమ్మారిని తరిమికొట్టేంత వరకూ రాజకీయాలు మాట్లాడను అని చెప్పిన జనసైనికుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ పట్ల తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు ప్రజలకు పదే పదే చెప్పడం కాకుండా తాను కూడా ఆచరిస్తున్న సందేశాన్ని పంపిస్తున్నారు కాటమరాయుడు.
అమలులో ఉన్న లాక్ డౌన్ ఆంక్షలు.. ఎవ్వరూ అతీతులు కాదంటున్న గబ్బర్ సింగ్..
ప్రత్యక్షంగా రాజకీయ విమర్శలు చేయకుండా ప్రెస్ నోట్ల ద్వారా తాను చెప్పాలనుకున్న సందేశాన్ని ప్రజలకు అందజేస్తున్నారు పవన్ కళ్యాణ్. లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ విజన్ ని కూడా ప్రెస్ నోట్ రూపంలోనే స్వాగతించారు పవన్ కళ్యాణ్. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రతిపక్ష పార్టీ నేతగా తన వంతు బాధ్యతను నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ శ్రేణులను క్షేత్ర స్థాయిలో పర్యటించడమే కాకుండా, కరోనా ఆంక్షల నేపథ్యంలో నిరుపేదల సమస్యలు తెలుసుకుని సహాయం అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసారు గబ్బర్ సింగ్.
కరోనా క్లిష్ట సమయంలో జాగ్రత్తగా ఉండాలి.. జనసైనికుల ద్వారా నిరుపేదలకు సాయం అందిస్తున్న పవన్..
షూటింగ్ లకు కూడా విరామం ప్రకటించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న లాక్ డౌన్ ఆంక్షలను, అదే సమయంలో నిరుపేదలు, వలస కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపైన పవన్ కళ్యాణ్ దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. తన దృష్టికి వచ్చిన సమస్యలను లేఖ రూపంలోనో, ప్రెస్ నోట్ రూపంలోనో ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. కరోనా క్లిష్ట సమయంలో ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కాకుండా ప్రెస్ నోట్ల రూపంలో చైతన్యం తీసుకురావడం పట్ల పవన్ కళ్యాణ్ కు సానుకూల స్పందన వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది.