పవన్ కళ్యాణ్ కొత్త సమీకరణం - ప్రజల్లోకి జనసేనాని : బీజేపీ - టీడీపీతో పొత్తు పైనా..!!
ఏపీలో 2024 ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ముందుగానే సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ..ప్రధాన ప్రతిపక్ష టీడీపీలో కసరత్తు మొదలైంది. ఇక, ఈ నెల 14న జరగనున్న పార్టీ ఆవిర్భావ సభ ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఎన్నికలకు సమాయత్తం కానున్నారు. ఈ సారి పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణను జనసేన నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే లక్ష్యంతో ఈ సభను నిర్వహిస్తున్నారు. రాజకీయంగా జనసేన వైఖరిని ఇదే వేదిక నుంచి పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని పార్టీ సీనియర్ నేత మనోహర్ సైతం స్పష్టం చేసారు.

2024 ఎన్నికలే లక్ష్యంగా సభ
సభా ప్రాంగణానికి మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చైతన్య వేదిక అని పేరు ఖరారు చేసారు. ఆవిర్భావ సభ ఏర్పాట్లను పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు పరిశీలించారు. ఇప్పటికే సభ నిర్వహణ కోసం 12 కమిటీలు ఏర్పాటు చేసారు. అయితే, ఈ సభ ద్వారా ఇప్పటి వరకు పవన్ ఇచ్చిన ప్రసంగాలకు భిన్నంగా భవిష్యత్ వ్యూహాల పైన స్పష్టత ఇస్తూ సాగుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇప్పటికే బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ పైన ఆ పార్టీతో సంబంధాల పైన క్లారిటీ ఇవ్వనున్నారు. తెలంగాణలో దాదాపుగా బీజేపీతో పవన్ దూరంగానే ఉంటున్నారు. అక్కడ కమలం పార్టీ నేతల తీరు పైన జనసేనాని అసహనంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే, ఏపీలో మాత్రం బీజేపీతో ఇప్పటి వరకు పొత్తు కొనసాగుతోంది.

పొత్తులపైన పవన్ క్లారిటీ
కానీ, ఎన్నికల కోసం పొత్తు కొనసాగించాలా .. లేక, తమ వైఖరి మార్చుకోవలా అనే దాని పైన పార్టీ నేతలతో పవన్ అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనకు స్నేహ హస్తం అందించారు. కానీ, పవన్ మాత్రం ఇదంతా మైండ్ గేమ్ గా కొట్టి పారేసారు. అందరితో చర్చించి...పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు పొత్తుల పైన స్పష్టత ఇవ్వనున్నట్లు గతంలోనే పార్టీ నేతలకు చెప్పారు.
దీంతో రానున్న ఎన్నికల్లో జనసేన పొత్తుల అంశం పైన పవన్ పార్టీ ఆవిర్భావ సభలో ఏం ప్రకటన చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇదే సమయంలో పవన్ కొత్త రాజకీయ సమీకరణం పార్టీ ద్వారా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా తమతో కలిసొచ్చే వర్గాలతో పాటుగా - బీసీ - ఎస్సీ - ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ కలిపి ప్రతీ జిల్లాలోనూ జనసేన పొలిటికల్ కమిటీలు ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

కొత్త సమీకరణాల పైన ప్రకటన దిశగా
దీని ద్వారా.. గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గ ఓట్ల విషయంలోనూ ఆశించిన స్థాయిలో పార్టీకి ఓటింగ్ జరగలేదని పార్టీ నేతలే చెబుతున్నారు. దీంతో..ఈ సారి కాపు నేతలతో పాటుగా బీసీ - ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త సమీకరణం తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
వైసీపీ - టీడీపీ పార్టీలకు రెండు సామాజిక వర్గాలు అండగా నిలుస్తాయనే ప్రచారంతో.. ఇతరుల ను ఏక తాటి పైకి తెచ్చే ప్రయత్నాలను పవన్ కళ్యాణ్ ఈ సభ ద్వారా ప్రారంభించే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. 2019 ఎన్నికల్లో జగన్ అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ ఆ స్థాయిలో ఓట్లు .. సీట్లు వైసీపీకి తెచ్చి పెట్టిందనే అభిప్రాయంతో ఆ నేతలు ఉన్నారు.
Recommended Video

ప్రజల్లోకి పవన్ కళ్యాణ్
దీంతో..ఈ సారి ముందుగానే కొత్త సమీకరణాలతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో ఎన్నికల్లో సామాజిక సమీకరణాలే కీలకం కావటంతో .. జనసేన అధినేత ఆ దిశగా పార్టీ ఆవిర్భావ సభ ద్వారా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లేందుకు డిసైడ్ అయ్యారని.. ఆయన బస్సు యాత్ర చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. దీంతో..పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా ఈ సభలో చేసే ప్రసంగంలో ఏ అంశాలు ప్రస్తావిస్తారు.. .ఎటువంటి ప్రకటనలు చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications