అరకులోయ:పవన్ కళ్యాణ్ ను కలసి గోడు వెళ్లబోసుకున్న గిరిజనులు
విశాఖపట్టణం:ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రజాపోరాట యాత్ర విశాఖ జిల్లాలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అస్వస్థత కారణంగా యాత్రకు రెండు రోజుల విరామం ఇచ్చిన పవన్ నేడు అరకులోనే గిరిజనుల కాలనీలకు వెళ్లి వారితో సమావేశమయ్యారు.
Recommended Video

సుదీర్ఘసమయం పాటు సాగిన ఈ ముఖాముఖిలో పవన్ గిరిజనుల సమస్యల గురించి కూలంకషంగా అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. అలాగే గిరిజనులు కూడా పవన్ ను తమ ఆత్మీయుడిగా భావించి వారి సమస్యలన్నీ ఏకరువు పెట్టినట్లు సమాచారం. పవన్ కేవలం వారి సమస్యలు విని ఊరుకోవడం కాకుండా కొన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనేదిశలో కొన్ని చర్యలకు శ్రీకారం చుట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

విభిన్నంగా...పవన్ పర్యటన.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర విభిన్నంగా సాగుతోంది. విశాఖ జిల్లాకు చేరుకోవడంతోనే తన పర్యటనకు రెండు రోజుల విరామం ఇచ్చిన పవన్ మూడో రోజు కూడా విశ్రాంతి తీసుకొని బుధవారం నుంచి మళ్లీ యాత్ర ప్రారంభిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే పవన్ అందుకు భిన్నంగా మంగళవారం తాను బసచేసిన అరకు లోయకు సమీపంలోని డుంబ్రిగూడ మండలం పోతంగి కాలనీకి వెళ్లి అక్కడ గిరిజనులతో సమావేశమయ్యారు. వారి సమస్యల గురించి ఆరా తీసారు.

పవన్ తో...గిరిజనుల గోడు
ఈ సందర్భంగా జనసే అధినేత పవన్ కళ్యాణ్ తో గిరిజనులు తమ గోడు వెళ్లబోసుకున్నట్లు తెలిసింది. తమకున్న సమస్యలన్నీ పవన్ ముందు ఏకరువు పెట్టారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అంతేకాకుండా తమ సమస్యల గురించి ఎవరి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని...నేటికి ఒక్కరు కూడా తమ సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని వారు తమ ఆవేదనని వ్యక్తం చేశారట.

పరిష్కారం...దిశలో
ఈ సందర్భంగా పవన్ గిరిజనులకు తాగునీటి సదుపాయం గురించి సవివరంగా అడిగి తెలుసుకున్నారు. మంచినీళ్లు...ఎక్కడినుండి...ఎంతదూరం నుండి...ఎలా తెచ్చుకుంటున్నారు...అనే వివరాలు అడిగారు. అందులో భాగంగా అక్కడ గిరిజనులు తాగే నీరుని ఒక బాటిల్లో నింపి ఆ నీటి శాంపిల్ హైదరాబాద్ పంపి రిపోర్ట్ తెప్పించాలని తన సిబ్బందిని ఆదేశించారు. రిపోర్ట్స్ వచ్చాక ఆ నీరు ఎంత సురక్షితమో అందరికి తెలియజేస్తానని...అలాగే వాటిపై ఏమి చర్యలు తీసుకోవాలో కూడా తెలియజేస్తానని పవన్ గిరిజనులకు హామీ ఇచ్చారు. అలాగే గిరిజనులు తామెదుర్కొంటున్న మరొక ప్రధాన సమస్య "వైద్యం" గురించి పవన్ కు తెలియజెప్పారు. పవన్ ఆ వివరాలు తన సిబ్బందిని నోట్ చేసుకోమన్నారు.

హాస్టల్ విద్యార్థినులతో...ముఖాముఖి
అలాగే గిరిజనులను పవన్ మౌలిక సదుపాయాలు, రోడ్లు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వపరంగా ఇళ్ళు ఎంతమందికి ఇచ్చారు.నేటి వరకు అధికారులు కానీ నాయకులు కానీ ఎవరెవరు వచ్చి మీ సమస్యలు తెలుసుకున్నారు...తదిదర విషయాలు వారిని అడిగి తెలుసుకున్నారు. అంబులెన్స్ సౌకర్యం అందుబాటులో ఉందా...లేదా అని ఆరా తీసారు. ఆ తరువాత స్థానికంగా ఉన్న కస్తూర్భా బాలికల హాస్టల్ ను పవన్ సందర్శించారు. అక్కడి విద్యార్థినులతో మాట్లాడారు. విద్య,వసతి సదుపాయాల లభ్యత గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ గిరిజనులకు సంబంధించి సంస్కృతి,సంప్రదాయాలకు నష్టం వాటిల్లకుండా అభివృద్ధి జరగాలని...అంతేతప్ప బాక్సైట్ తవ్వకాలతో కూడిన అభివృద్ధి అక్కరలేదని అన్నారు.












Click it and Unblock the Notifications