కేటీఆర్-కేసీఆర్ తర్వాత జనసేనానిని పక్కకు తీసుకెళ్లి మాట్లాడిన గవర్నర్, పవన్ ఏం చెప్పారంటే?
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్లో శనివారం తేనీటి విందు (ఎట్ హోమ్) ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఎట్ హోంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. ఆయనతో కేసీఆర్, కేటీ రామారావులు కాసేపు మాట్లాడిన విషయం తెలిసిందే. కేసీఆర్ టీ తాగుకుంటూ ఏదో చెబుతుంటే పవన్ కళ్యాణ్ కూడా టీ తాగుతూ సావధానంగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. పవన్, కేసీఆర్ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
'మైనస్ జనసేన' సర్వే.. ఎందుకంటే! జగన్-బాబులకు అసలు కథ ముందుందా?
కేసీఆర్, కేటీఆరే కాదు.. పవన్ కళ్యాణ్తో గవర్నర్ కూడా భేటీ
పవన్ కళ్యాణ్తో తెలంగాణ సీఎం కేసీఆర్, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు మాత్రమే కాదు... ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కూడా విడిగా మాట్లాడారు. ముగ్గురు నేతలు కూడా జనసేనానితో విడివిడిగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్, కేసీఆర్లతో భేటీ అనంతరం గవర్నర్.. జనసేనానితో కాసేపు విడిగా మాట్లాడారు. గవర్నర్.. పవన్ను పక్కకు తీసుకెళ్లి రెండు నిమిషాలు మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ ఏం చెప్పారంటే
ఎట్ హోం విందు అనంతరం పవన్ కళ్యాణ్ను కొందరు పాత్రికేయులు కలిసి.. ఏం మాట్లాడుకున్నారని అడిగారు. కొత్త విషయాలు ఏవీ లేవని, గతంలోను తాను రాజ్ భవన్లో జరిగిన తేనీటి విందుకు వచ్చానని, ఇప్పుడు మరోసారి హాజరయ్యానని చెప్పారు.
ఎట్ హోంలో పవన్ కళ్యాణ్ ఇలా
ఎట్ హోం సందర్భంగా పవన్ కళ్యాణ్ తొలుత అతిథుల వేదిక వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడ కేటీఆర్ ఉండగా, ఇద్దరు ఆలింగనం చేసుకొని, దాదాపు పది పదిహేను నిమిషాలు మాట్లాడుకున్నారు. కాంగ్రెస్ నేతలతో ముచ్చటించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైనందుకు కంగ్రాట్స్ తెలిపారు. ఏపీ రాజకీయ పరిణామాలపై కూడా చర్చించారని భావిస్తున్నారు. ఆ తర్వాత కేసీఆర్ అక్కడకు వచ్చారు. అప్పుడు పవన్, కేసీఆర్ కాసేపు మాట్లాడుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించడంపై అభినందనలు తెలిపారు. ఇరువురి మధ్య ఏపీ రాజకీయాలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సన్నద్ధత, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంశాలు చర్చకు ఉంటాయని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ పంచెకట్టుతో
పవన్ కళ్యాణ్ పంచెకట్టుతో ఎట్ హోం విందుకు వచ్చారు. ఆయన తిరిగి వెళ్లే సమయంలో పలువులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. కేసీఆర్, పవన్ కళ్యాణ్లు మాట్లాడుకునే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత మల్లుభట్టి విక్రమార్కను పిలిచిన ముఖ్యమంత్రి.. తన పక్కనే కూర్చోబెట్టుకొని పవన్కు పరిచయం చేశారు. భట్టి తనకు తెలుసునని పవన్ చెప్పారు. కాగా, కేసీఆర్, పవన్లు మాట్లాడుకునే సమయంలో వారి పక్క సీట్లోనే కేఈ కృష్ణమూర్తి ఉన్నారు.