ఆసక్తికరం: పరిటాల ఇంటికి పవన్, ఎదురెళ్లిన శ్రీరామ్, 'తెలంగాణ ఇష్యూలా కావొద్దు'
Recommended Video
అనంతపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురం పర్యటనలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జనసేనాని మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లారు. పవన్ను పరిటాల శ్రీరామ్ ఎదురెళ్లి సాదరంగా లోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పరిటాల ఇంట్లో పవన్ టిఫిన్ చేశారు.
పవన్తో టీడీపీ ఎమ్మెల్యే గంటన్నరపాటు భేటీ, జైళ్లో పెట్టినా: బాబుకూ జనసేనాని ఝలక్!
దాదాపు గంట పాటు పరిటాల సునీతతో మాట్లాడారని తెలుస్తోంది. రాయలసీమలో కరువు పరిస్థితులు, రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలకు తాగునీటి సమస్య తదితర అంశాలపై వీరు మాట్లాడుకున్నారని తెలుస్తోంది. పవన్ వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయాలని భావిస్తోన్న విషయం తెలిసిందే.
చదవండి: చంద్రబాబును ఆకాశానికెత్తిన సోము వీర్రాజు, కానీ
అందుకే పరిటాల సునీత ఇంటికి
పరిటాల సునీత ఇంటికి రావడంపై పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సమస్యల గురించి అవగాహన కోసమే తాను పరిటాల కుటుంబాన్ని కలిశానని చెప్పారు. ప్రాజెక్టు విషయంలో కొంత అధ్యయనం చేసిన తర్వాత ఎలా ముందుకు వెళ్లాలో చూస్తామని చెప్పారు. అందరం కలిసి వస్తేనే అనంత కరువు సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.
ప్రధానికి అందజేస్తా
అనంతపురం కోసం తాను అందరిని కలుపుకొని వెళ్లాలని భావిస్తున్నానని పవన్ చెప్పారు. అనంతకు ఏం చేస్తే బాగుంటుందని ప్రధానికి ఇచ్చే నివేదికలో భాగంగా ఇక్కడకు వచ్చానని చెప్పారు. అన్నింటిని అర్థం చేసుకొని, అధ్యయనం చేసి ప్రధానికి నివేదిక ఇస్తానని చెప్పారు.
ప్రత్యేక దృష్టి
అనంతపురంలో ఇప్పుడు మూడు రోజుల పాటు పర్యటిస్తున్నానని, ఇక్కడికి మరో రెండుమూడుసార్లు రావాల్సి వస్తుందని, అనంతపై ప్రత్యేక దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ అన్నారు. అనంతను పూర్తిగా పరిశీలిస్తానని, ఇప్పుడు తొలిసారి పర్యటిస్తున్నానని, మళ్లీ మళ్లీ పర్యటిస్తానని చెప్పారు.
ప్రజాభీష్టం మేరకే, ఎన్నికల సమయంలో పొత్తులపై
2019లో టీడీపీతో కలిసి పని చేస్తారా అని విలేకరులు ప్రశ్నిస్తే.. తాను ప్రజాభీష్టం మేరకే ముందుకు సాగుతానని పవన్ అన్నారు. తనకు వ్యక్తిగతంగా అందరి పైనా గౌరవం ఉంటుందని, తనకు ఎవరితోను వ్యక్తిగత విభేదాలు లేవని, గొడవలు పెట్టుకోవాలని లేదని, ప్రజాభీష్టం మేరకు నడుచుకుంటానని చెప్పారు. ఎన్నికల సమయంలో పొత్తుల గురించి మాట్లాడుతానని చెప్పారు.
మేనిఫెస్టో హామీలపై పవన్ కళ్యాణ్ ఇలా
మేనిఫెస్టోను అమలు చేసిన పార్టీలకే మద్దతిస్తానని చెప్పారు కదా అని విలేకరులు ప్రశ్నించగా పవన్ సమాధానం చెప్పారు. తాను పొలిటికల్ అకౌంటబులిటీ అడుగుతున్నానని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కొన్ని సాధ్యపడతాయని, మరికొన్ని సాధ్యపడవని పవన్ అన్నారు. అలాగే సాధ్యపడని పక్షంలో ప్రజలకు నిజాయితీగా దాని గురించి చెప్పగలగాలన్నారు. ఉదాహరణకు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ చెప్పిందని, అది ఎందుకు ఇవ్వలేమో సరైన కారణం చెప్పగలగలగాలని అన్నారు. ఆ అకౌంటబులిటీ ఇవ్వాలన్నారు. లేదంటే ఓటు అడిగే హక్కు లేదన్నారు.
రైతు కోర్టుకు వెళ్తే కూడా సమస్య ఆగిపోవచ్చునని, ఇలాంటి కారణాలు ఎన్నో ఉంటాయని, మేనిఫెస్టోలో చెప్పినవి చేయాలని, చేయకుంటే ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు.
అమరావతిలో తమ పాత్ర లేదని రాయలసీమవాసులు
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తమ పాత్ర లేకుండా పోయిందని రాయలసీమ ప్రజలు భావిస్తున్నారని పవన్ చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్లోనే అభివృద్ధి జరిగిందని, దాని వల్ల ఏపీ నష్టపోయిందనే అభిప్రాయం ఉందన్నారు. కాబట్టి హైకోర్టు రాయలసీమలో ఉంటే బాగుంటుందనే అభిప్రాయం తనకు కూడా ఉందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని, అయితే అన్నీ తెలుసుకున్నాక మాట్లాడుతానని చెప్పారు. ప్రధానికి ఇచ్చే నివేదికలో రాయలసీమ అంశాలను ప్రస్తావిస్తానని చెప్పారు.
తెలంగాణ ఇష్యూలా కావొద్దు
విభజన తర్వాత ఎక్కువ ఇబ్బంది పడింది రాయలసీమ ప్రాంతమని, తూర్పు ఆంధ్రా ప్రాంతమన్నారు. ఈ రెండు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పవన్ అన్నారు. అమరావతిలో తమకు పాత్ర లేదని రాయలసీమ వాసులు భావిస్తున్నారని, తెలంగాణ ఇష్యూలో రాయలసీమ వాసుల్లో అలాంటి అభిప్రాయం రాకుండా పాలన సాగాలని అన్నారు.